న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరి ప్రియాంక రాధక్రిష్టన్ (పార్లమెంట్ సభ్యురాలు) బుధవారం ప్రగతిభవన్లో మంత్రి కెటిఆర్ను కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణలో న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈ సమావేశంలో స్ధానిక రాజకీయ వ్యవస్ధల పని తీరుపై వారు చర్చించారు.
తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్ధితులను ప్రియాంకకు మంత్రి కెటిఆర్ వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని, టిహబ్, విహబ్ వంటి ఇంక్యూబేటర్ల ద్వారా ఈ రంగంలో ముందున్నామన్నారు. దీంతోపాటు త్వరలోనే టిహబ్ రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఉన్న విదేశీ స్టార్ట్ అప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశించిన టి- బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టి బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్ట్ అప్స్తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అలాగే అగ్రిటెక్ రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగంలో, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికే ఇక్రిసాట్ తో అగ్రిటెక్ రంగంలో పనిచేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు.
దీంతో పాటు న్యూజిలాండ్ ప్రధాని జస్సిండా అర్డన్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నారన్నారు. ఆమె నాయకత్వం పట్ల మంత్రి కెటిఆర్ ప్రసంశలు కురిపించారు. ఆమెను కలిసేందుకు తాను సమావేశం ఏర్పాటు చేస్తానని, న్యూజిలాండ్ లో పర్యటించాల్సిందిగా ఈ సందర్భంగా కెటిఆర్ను ప్రియాంక కోరారు. ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రియాంకకు తెలిపారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్తో జరిగిన సమావేశం పట్ల ప్రియాంక హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నారైలతో న్యూజిలాండ్ లో కలిసి పనిచేస్తున్నామని ప్రియాంకా తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రతియేటా నిర్వహిస్తున్నామన్నారు. దీంతోపాటు మంత్రి కెటిఆర్తో సమావేశం ఏర్పాటు చేసేందుకు సహకరించిన న్యూజిలాండ్ టిఆర్ఎస్ శాఖ నాయకులకు ఎంపి ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నారై టిఆర్ఎస్ కో..ఆర్డినేటర్ మహేష్ బిగాల తదితరులు ఉన్నారు.