హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా మార్చి నెలలో వింగ్స్ ఇండియా2020 కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ సన్నాహాక సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని ఐటి, పరిశ్రమల శాఖ మ్రంతి కెటిఆర్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ ఆహ్వానించారు. ఈ మేరకు కెటిఆర్కు ఆహ్వానం పంపిన కేంద్రమంత్రి వింగ్స్ ఇండియా కార్యక్రమం దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందన్నారు. దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 12 నంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయ వేదికగా వింగ్స్ ఇండియా2020 కార్యక్రమం జరగనుంది.
కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వైమానిక సదస్సు కూడా నిర్వహించనుంది. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్లైన్స్, విమాన తయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వైమానిక రంగ ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచ వైమానిక సదస్సు ద్వారా దేశంలోని ఎయిరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను ప్రపంచ కంపెనీలకు తెలిపే అవకాశం కలుగుతుందని కేంద్ర మ్రంతి హర్దీప్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ వేదికగా జరగనున్న సన్నాహక సమావేశంలో పౌర విమానయాన శాఖతో పాటు కేంద్ర వ్యాపార వాణిజ్య శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కే్రందపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.