Friday, May 3, 2024

మన నీటి వాటా విషయంలో రాజీపడం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఏపి దోపిడీ
బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వినియోగంలో విఫలం
మంత్రి జూపల్లి కృష్ణారావు

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మనకు తీవ్ర అన్యాయం జరగడానికి కారణం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో రాజీపడేది లేదని మంత్రి స్పష్టంచేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గురించి సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని,తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్య బోర్డుకు అప్పగించబోమని అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కృష్ణా జలాల వాటాను 299: 512 టీఎంసీలుగా 2015 నుంచి 2023 వరకు ఒప్పుకొని ఇప్పుడు వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు 50:50 నీటి వాటాపై పోరాడాలని తమకు నీతులు చెపుతున్నారని ద్వజమెత్తారు. ఏపి కేటాయింపును మించి వాడుకుందని, ఈ 299 టిఎంసిలను కూడా తొమ్మిదిన్నర ఏండ్లలో ఏ సంవత్సరం కూడా పూర్తిగా వినియోగించు కోలేకపోవడానికి గత ప్రభుత్వం వైఫల్యం కారణం కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగడానికి కారణం కేసిఆరేనని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నా.. అప్పట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

రైతులపాలిట కెసిఆర్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్ నేతలు ద్రోహులుగా నిలిచిపోతారని విమర్శించారు. కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం పెంచటంలో గత కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దక్షిణ తెలంగాణ దారుణంగా మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులోనూ వివక్ష చూపారని, ప్రాజెక్ట్ ల కింద కాలువల పనులను చేపట్టకపోవడం, ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడం మూలంగా జిల్లా ప్రజలకు సాగునీరు ఇస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమతమయ్యాయని దుయ్యబట్టారు. కాల్వలు, పిల్ల కాల్వల పనులను కూడా పూర్తి చేయలేదని, ఇప్పటివరకు చివరి ఆయకట్టుకు నీరందించలేకపోయారని అన్నారు. చేసిందంత చేసి బీఆర్‌ఎస్ నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ మేరకు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News