బెంగళూర్ : తన కుమారుడు బివై విజయేంద్రపై వచ్చిన లంచగొండి ఆరోపణల్ని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప సవాల్ విసిరారు. శనివారం యడియూరప్పపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పక్షం నేత సిద్దరామయ్య చేసిన ఆరోపణలపై యడియూరప్ప ఘాటుగా స్పందించారు. బెంగళూర్ అభివృద్ధికి సంబంధించిన రూ.666 కోట్ల ప్రాజెక్ట్ విషయంలో విజయేంద్ర ముడుపులు స్వీకరించినట్టు సిద్దరామయ్య ఆరోపించారు.
దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ కథనం ఓ కన్నడ ఛానల్లో రావడాన్ని సిద్దరామయ్య ఉటంకించారు. అయితే, అవి ఆధారంలేని ఆరోపణలని యడియూరప్ప కొట్టివేశారు. విజయేంద్ర ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు. మరోవైపు ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఛానల్పై సదరు కాంట్రాక్టర్ కేసు నమోదు చేసినట్టు ఆ రాష్ట్ర న్యాయశాఖమంత్రి జెసి మధుస్వామి అసెంబ్లీకి తెలిపారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని సిద్దరామయ్య డిమాండ్ చేశారు.