Friday, May 3, 2024

ప్రధానిని ప్రశ్నించే అర్హత మీకు లేదు : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా మార్చిన బిఆర్‌ఎస్ నేతలు.. ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని తెలంగాణ పర్యటనపై ప్రశ్నించేందుకు కెటిఆర్ ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను పథకాల పేరుతో మోసం చేసిన మీరా… మోడీని ప్రశ్నించేది? అన్నారు.

ఎపితో కుమ్మక్కై, కృష్ణా జలాల్లో 299 టిఎంసీలకు సంతకం చేసిన మీరా… కృష్ణా జలాల్లో వాటాపై ప్రశ్నించేది?.. 575 టిఎంసిలు రావలసినచోట, 299 టిఎంసిలు వస్తున్నాయి. పాలమూరు ప్రజలను పచ్చిగా దగా చేస్తున్నారు. కెటిఆర్.. మాటలు జాగ్రత్త, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని విమర్శిస్తావా? రాష్ట్రానికి ట్రైబల్ మ్యూజియం, సైనిక్ స్కూల్ మంజూరు చేయించిందే కిషన్ రెడ్డి అని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డులో రైల్వే లైన్ కోసం ప్రధానిని ఒప్పించి, సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించింది కిషన్ రెడ్డి కాదా? నిజంగా కెటిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే… రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా, రైల్వే లైన్ కోసం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. బిసి వ్యతిరేకి బిజెపి అంటున్న ఎమ్మెల్సీ కవితకు… బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించింది బిజెపి అన్నది తెలియదా? అని ప్రశ్నించారు. 17 సార్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించలేని మీ అసమర్థ ప్రభుత్వమా… మా ప్రధానిని ప్రశ్నించేది?, అర్హత లేని వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మీరు ప్రతిపాదిస్తే… వారిని నిబంధనల ప్రకారం గవర్నర్ గారు రిజెక్ట్ చేస్తే… గవర్నర్ గారికి రాజకీయాలు ఆపాదిస్తారా? అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News