Sunday, April 28, 2024

పర్యాటకులను ఆకర్షిస్తున్న 14 జలపాతాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం జలపాతాలకు చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14 జలపాతాలు ఉన్నాయి. వీటిలో దక్షిణ భారత కాశ్మీర్‌గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా ఇందులో ముఖ్యమైంది. ప్రకృతి వడిలో పరవసించిపోవాలనుకునే వారికి… తెల్లటి నురగలు కక్కుతూ మనల్ని కట్టి పడేస్తున్నాయి. ఎత్తయిన కొండల్లో నుంచి.. దట్టమైన అడవుల్లో నుంచి బయట ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి జలపాతాలు అద్భుతమైన కేంద్రాలు అవుతున్నాయి.

ముఖ్యంగా నయాగరా జలపాతాల తరహాలో..ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మన తెలంగాణలో పక్కనే కేవలం ఒకటి రెండు వందల కిలోమీటర్ల దూరంలోనే ఎత్తయిన జలపాతాలు ఇక్కడి సొంతం . వీటలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజక వర్గ పరిధిలో సహ్యద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరుంది. కుంటాల.. అనే పేరు వెనుక గొప్ప చరిత్ర కూడా ఉంది. శకుంతల, దుశ్యంతలు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.

కుంతల రానురాను కుంటాలగా పేరు మారిందంటారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో దగ్గరికి వెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు కుంటాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం అద్బుతంగా అనిపిస్తుండడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వరుస వర్షాలు కావడంతో ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. 45 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడే నీళ్లు వినసొంపుగా శబ్దం చేస్తు పరుగులు తీస్తున్నాయి. ఈ జలపాతం కిందకి చేరి జలకాలాటలు ఆడేందుకు జనం పరుగులు తీస్తున్నారు. కుంటాలలోనే కాదు.. భోగత లోనే అలాగే జన సందడి నెలకొని ఉంది. ఈ భోగత జలపాతం భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం పల్లి వద్ద ఉంది. ఇది ఇది తెలంగాణలో రెండవ అతిపెద్ద జలపాతం కూడా కావడం విశేషం. గుర్రపు నాడ ఆకారంలో ఉండే దీనిని తెలంగాణ నయాగరా జలపాతంగానూ పిలుస్తారు. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు వద్ద కడెం నదిపైనే మరో జలపాతం ఉంది.

దీనిపేరు గాయత్రి జలపాతం . ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం కావడంతో పర్యాటకులు ఈ జలపాతంను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదే జిల్లాలోని నిర్మల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో కొరటికల్లు పేరుతో మరో జలపాతం ఉంది. ఇది నేరడిగొండ మండల పరిధిలోకి వస్తుంది. ఈ జలపాతమే కాదు.. తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సప్త గుండాల జలపాతం కూడా ప్రస్తుతం పరుగులు పెడుతోంది. దీనిని బాహుబలి వాటర్ ఫాల్ అని పిలుస్తారు. దీంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లూరులో ఉన్న చింతామణి జలపాతం, నాగర్ కర్నూలు జిల్లాలోని మల్లెల తీర్థం జలపాతాలు భారీ వర్షాలతో నయాగరా జలపాతాలనే మరిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News