విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇoదుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు డి ఎ ప్రకటించి ప్రసంగించారు. ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని, ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 1.944 శాతానికి డిఏ పెంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప మనసుతో తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలోని 71,417 ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ పెంచిన డిఎ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల తోపాటు ఆర్టిజన్స్ కు వర్తిస్తుందని అన్నారు. గతంలో 14.074శాతంగా ఉన్న డిఏ ను 16.018 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెంచిన డిఎ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
పెంచిన డీఎతో విద్యుత్ సంస్థపై ప్రతి నెల 11.193 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. అయినా ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో పోటీ ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికి విద్యుత్తు అనివార్యం అయ్యిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చిందన్నారు. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని, అయినప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు ఓ కుటుంబం మాదిరిగా శ్రమించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా పెరగనుందన్నారు. రాష్ట్రంలో 2029-30 నాటికి 26,299 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడనుందని, 2034- 35 నాటికి 33,773 మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందని వివరించారు.
భవిష్యత్తు డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటినుంచే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025 తీసుకువచ్చి 2029 -30 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు ఒక ఆదర్శ కుటుంబం అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు రత్నాకర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శివాజీ, 1104 యూనియన్ నేత సాయిబాబా, 327 యూనియన్ నాయకులు శ్రీధర్ , పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకుడు బేసిరెడ్డి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకుడు శ్యామ్ మనోహర్, 1535 యూనియన్ నాయకులు వజీర్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు సత్యనారాయణ, టిఆర్వికెఎస్ యూనియన్ నాయకులు కరెంటు రావు పాల్గొన్నారు.