Tuesday, April 30, 2024

సోషల్ మీడియాకే జై కొడ్తున్న భారతీయులు!

- Advertisement -
- Advertisement -

54% of Indians follow Social Media for factual info

సోషల్ మీడియాకే జై కొడ్తున్న భారతీయులు!
వాస్తవ సమాచారం కోసం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లనే నమ్ముతున్న అత్యధిక శాతం మంది
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ గ్లోబల్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ఒకప్పుడు దినపత్రికల్లో, టీవీలో వచ్చే వార్తలనే నిజమైన వార్తలుగా జనం నమ్మే వారు. అయితే ఇప్పడు కాలం మారిపోయింది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ రెండింటికన్నా కూడా జనం నిజమైన సమాచారం కోసం సోషల్ మీడియా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో 54 శాతం మంది వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్(ఒయుపి) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. ‘ది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో వాస్తవాలను ఎలా గుర్తిస్తారు, వాటిని పొందే మారాలను బట్టి ఎలా అంచనా వేస్తారు అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని అంచనా వేశారు. తప్పుడు సమాచారం, కల్పిత వార్తలకు సంబంధించిన భయాలున్నప్పటికీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తాము వెతికే, పంచుకునే సమాచారమే వాస్తవవమైన సమాచారం అని ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యూజర్లు నమ్ముతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నమ్మకం స్థాయి ఎక్కువగా ఉండడం విశేషం. ,కాగా వాస్తవ సమాచారం కోసం వెతికేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా 37 శాతం జనం సోషల్ మీడియా వైపు మొగ్గు చూసుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మెక్సికన్లు, దక్షిణాఫ్రికా వాసుల్లో అ శాతం 43గా ఉండగా, భారతీయుల్లో 54 శాతంగా ఉంది. ఈ విషయంలో బ్రిటన్‌లో జనం చాలా వెనుక బడి ఉన్నారు. అక్కడ కేవలం 16 శాతం మంది మాత్రమే సోషల్ మీడియాను తమ అచ్చుమెచ్చిన ప్లాట్‌ఫామ్‌గా భావిస్తున్నారు.

ఇక అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు సోషల్ మీడియానే ఎక్కువగా విశ్వసిస్తున్నారు. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా జనం ఎక్కువగా సమాచారం కోసం గూగుల్ లలాంటి సెర్చ్ ఇంజన్లపైన ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడయింది. ప్రసంచవ్యాప్తంగా 67 శాతం మంది ఈ వర్గం వారు ఉండగా, బ్రిటన్‌లో అది 62 శాతంగా ఉంది. అంతేకాదు మూడింట రెండు వంతుల మంది సోషల్ మీడియానుంచి తాము పంచుకునే సమాచారం కచ్చితమైందని బలంగా నమ్ముతున్నారట.ఈ విషయంలో భారత్ ప్రపంచ సగటుకన్నా కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉంది. ఇక్కడ 87 శాతం మంది తాము సోషల్ మీడియా ద్వారా పంచుకునే సమాచారమే కచ్చితమైనదిగా నమ్ముతున్నారట. బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా, భారత్, మెక్సికో దేశాలకు చెందిన 5,000 మందినుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
తమకు తెలిసిన సమాచారం నిజమైనదో, కాదో నిర్ధారించుకోవడానికి తాము ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటివి ముఖ్య భూమిక పోషిస్తాయని 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మరో వైపు ఇదే సమయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి ఎన్‌సైక్లోపీడియా లాంటి పుస్తకాలపై ఆధారపడే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. కాగా ఈ వేదికలను విశ్వసించే వారి విషయంలో భౌగోళిక వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. వాస్తవమేదో, కల్పితం ఏదో తెలుసుకోవడానికి భారత్‌లో 80 శాతం, మెక్సికోలో 60 శాతం మంది ఇలాంటి వేదికలపై ఆధారపడుతుంటే బ్రిటన్‌లో 27 శాతం, అమెరికాలో42 శాతం మంది మాత్రమే ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియా ద్వారా తాము పంచుకునే సమాచారం కచ్చితమైనదని నమ్మే వారిలో వృద్ధులకన్నా యువకులే ముందున్నారు. 25నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారిలో 55 శాతం ఉండగా, 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 13శాతమే సోషల్ మీడియా ద్వారా తాము నిజమైన సమాచారాన్ని పంచుకుంటున్నామని నమ్ముతున్నారు. కాగా వాస్తవానికి సంబంధించి జనం భావనలో మార్పు రావడంలో కరోనా మహమ్మారి కూడా కీలకపాత్ర సోషించినట్లు ఈ సర్వే ద్వారా వెల్లడయింది. ఇప్పుడు జనం తాము చూసే సమాచారం నిజమైందో కాదో అన్న విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు చెప్పడం గమనార్హం. భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో 80 శాతం మంది ఇలాంటివారు ఉండడం గమనార్హం. ముఖ్యంగా ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకన్నా కూడా భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడానికి సోషల్ మీడియాను, వాట్సప్‌లను ఎక్కువగా ఉపయోగించుకోవడం విశేషం. సమాచారాన్ని తెలుసుకోవడానికి విద్యా సంబంధిత పుస్తకాలు మొదలుకొని డిజిటల్ చానల్స్ దాకా అనేక మార్గాలు అందుబాటులో ఉండడం, ఒక బటన్ నొక్కితే చాలు అనేక సమాధానాలు అందుబాటులో ఉండడంలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గందరగోళానికి తమ సర్వే అద్దం పడుతుందని ఒయుపి సిఇఓ నిగెల్ పోర్ట్‌వుడ్ అభిప్రాయపడ్డారు.

54% of Indians follow Social Media for factual info

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News