ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో మంచు ఖండాలు, కొండచరియలు, భారీ హిమపాతం, ఎడతెరిపిలేని వానల కారణంగా పిల్లలు, మహిళలతో కలిపి దాదాపు 84 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. గత మూడు రోజులుగా పాక్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతోంది. రోడ్డు రవాణా, ఇతర కమ్యూనికేషన్లు స్తంభించి సామాన్య ప్రజాజీవితానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత 24 గంటల్లో మంచుఖండాలు విరిగిపడి 57 మంది మరణించగా, మరి కొందరు గల్లంతయ్యారు. బెలోచిస్థాన్లో వర్షాలు, హిమపాతం వల్ల 17 మంది మృతి చెందారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 41 మంది గాయపడగా, 35 ఇళ్లు దెబ్బతిన్నాయి. సోమవారం భారీ హిమపాతం కారణంగా వందలాది ప్రయాణికులు ఎక్కడికీ వెళ్ల లేక పోయారు. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో అనేక రోడ్లు భారీ హిమపాతం, వర్షాలు వల్ల రాకపోకలు లేకుండా నిర్మానుష్యమయ్యాయి. ఖైబర్ ఫక్తున్ఖవా లో కారకోరం జాతీయ రహదారి కొండచరియలు విరిగిపడడంతో మూసివేశారు. మలకండ్, హజారా డివిజన్లలో భారీ హిమపాతం తో మెయిన్ రోడ్లన్నీ మూసి వేశారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలిపోయాయి. సియాల్కోట్, గుజ్రత్, పంజాబ్ లోని మరికొన్ని నగరాలు పల్లపు ప్రాంతాలు వర్షం నీటితో ముంపునకు గురయ్యాయి.
Heavy snowfall nearly 85 lives in Pakistan