ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర నిర్వహిస్తారు. అక్కడి గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని విశ్వసిస్తారు. ఆదివాసీల సంప్రదాయాలకు పెద్దపీట వేసే నాగోబా జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. దేశం నలుమూలల నుంచి గిరిజనులు ఈ జాతరకు రావడం ఆనవాయితీ. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమౌతుంది.
మహాపూజ జరిగిన తర్వాతే ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేయవచ్చు. అంతవరకు లోపలకు వచ్చే అవకాశముండదు. మహాపూజ అనంతరం మెస్రం వంశీయులు భేటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. మెస్రం వంశంలోకి వచ్చిన కొత్త కోడళ్లకు నాగోబా దర్శనం చేయించి వంశ పెద్దలను పరిచయం చేస్తారు. అనంతరం వారిచే ఆశీర్వచనాలు ఇప్పిస్తారు. అలా ఈ భేటింగ్ కార్యక్రమంతో, కొత్త కోడళ్లు మెస్రం వంశంలోకి వచ్చినట్లు భావిస్తారు.
ఆదిశేషువు వస్తాడనే నమ్మకం
ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగోబా ఆలయం. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ సమీపంలోని కేస్లాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనేది ఓ నమ్మకం. వీరు పూజలు చేసి నైవేద్యంగా పెట్టిన పాలు తాగి ఆశీర్వచనాలు అందించి అదృశ్యమవు తాడని బలంగా నమ్ముతారు. నాగోబాను కొలిస్తే కొంగుబంగారంగా నిలుస్తాడని, పంటలు బాగా పండుతాయని, రోగాలు దరిచేరవని గిరిపుత్రుల ప్రగాఢ విశ్వాసం.
22 పొయ్యిలు.. అక్కడే వంట
నాగోబా జాతరకు ఎంతమంది మెస్రం వంశీయులు వచ్చినా పెట్టేది మాత్రం 22 పొయ్యిలే. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకోవడానికి వీల్లేదు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ పొయ్యిలు పెట్టరు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రహరీ లోపల మాత్రమే పొయ్యిలు పెడతారు.
ఆ గోడకు చుట్టూరా దీపాలు వెలిగించేందుకు చిన్న అరలు ఉంటాయి. అందులో పెట్టే దీపాల కాంతుల వెలుగులోనే వంటలు చేసుకోవాలి. ఆ వంటకాలను నాగోబాకు నైవేద్యంగా పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు.
Nagoba Jatara in Adilabad District