ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు
కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు డివిజన్లు ఏకగ్రీవం కావడంతో 58 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల పొలింగ్ జరిగింది. 58 డివిజన్లలో 62.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2,72,195 మంది ఓటర్లు ఉండగా 1,65,147 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 82,793 మంది,మహిళలు 82,350 మంది ఉన్నారు. 58 డివిజన్లలో 369 మంది అభ్యర్థులు తలపడ్డారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు 144సెక్షన్ అమలు చేశారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ కుటుంబసభ్యులు, రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్భర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ కె.శశాంక, పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జివి శ్యాంప్రసాద్ లాల్ వివిధ పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరగనుంది.