హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వి. శ్రీనివాస్గౌడ్లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ముందుగానే గ్రహించిన ఉత్తమ్…. ఓటమిపై సాకులు చెప్పుకునేందుకే ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై రాద్దాంతం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్లపై గగ్గొలు పెట్టిన ఉత్తమ్… ఫలితాలు వచ్చిన తరువాత ఎక్స్అఫిషియే సభ్యుల విషయంపై రాజకీయం చేయాలని చూశారని ధ్వజమెత్తారు.
మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్లు మాట్లాడుతూ, కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పురపోరు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సాధించిన ఫలితాలు చారిత్రాత్మకమన్నారు. బడుగు బలహీన వర్గాలకు టిఆర్ఎస్ ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదన్నారు. రాజకీయంగా గుర్తింపు లేని అనేక వర్గాలకు సిఎం కెసిఆర్ మున్సిపల్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ఘనత కెసిఆర్దేనని అన్నారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శల్లో పస లేదని టిఆర్ఎస్ పాటించిన సామాజిక న్యాయ సూత్రం నిరూపించిందన్నారు. ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్కు ఓ చరిత్ర అయితే పాటించిన సామాజిక న్యాయం మరో చరిత్రగా వారు అభివర్ణించారు.
మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత అనైతిక పొత్తు పెట్టుకున్నాయని మంత్రులు విమర్శించారు. కనీసం వెయ్యి వార్డుల్లో రెండు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ , బిజెపిలు నీచ రాజకీయానికి ఒడిగట్టాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం బిసిలకు ఈ ఎన్నికల్లో 23 శాతం సీట్లను ప్రతిపక్షాలు కేటాయిస్తే, సిఎం కెసిఆర్ మాత్రం 45 శాతం టికెట్లు ఇచ్చి ఫూలే అనిపించుకున్నారన్నారు. ఆంధ్రా కాంగ్రెస్ ఎంపి సహకారం తో నేరేడుచర్లలో గెలవాలని ఉత్తమ్ చూశారన్నారు. ఇంతకన్నా సిగ్గు మాలిన చర్య ఏదైనా ఉంటుందా? అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ప్రజలు పట్టించుకోకుండా కర్రు కాల్చి వాతలు పెట్టారన్నారు. తెలంగాణను దోచుకున్న కెవిపిని ఏముఖం పెట్టుకుని ఉత్తమ్ ఎక్స్అఫిషియోగా ఎంపిక చేసుకున్నారని ప్రశ్నించారు.