‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న కీర్తి సురేష్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మిస్ ఇండియా’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగి సొరంగమై…’ అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ జీవితంపై తనకున్న పాజిటివ్ దృకృథాన్ని తెలియజేస్తుంది. ఈ పాటను యూరప్లోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరించారు.
ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు. శ్రేయా ఘోషల్, తమన్ ఈ పాట పాడారు. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ “మహానటి చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకున్న తర్వాత కీర్తిసురేష్ నటిస్తున్న తొలి చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది ఈ చిత్రం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను మార్చి నెలలో విడుదల చేస్తాం”అని అన్నారు. జగపతిబాబు, వి.కె.నరేష్, నవీన్ చంద్ర, నదియా, రాజేంద్రప్రసాద్, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః సుజిత్ వాసుదేవ్, డాని షాన్సెజ్, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఆర్ట్ః సాహి సురేష్.