ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
కూతురును డ్యాన్స్ స్కూల్లో వదిలేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం
పుట్టిన రోజే మరణించిన దివ్య
మన తెలంగాణ/ముషీరాబాద్ : అమెరికాలోని డల్లాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రాజా గవిని (40), దివ్య (33), దంపతులతో పాటు వారి స్నేహితుడు ప్రేమ్నాథ్ (39) కూడా ఘటనా స్థలంలో మృతి చెందారు. దివ్య తండ్రి గౌతమ్బుద్ధ, మేనమామ రాఘరావులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన రాజేంద్రప్రసాద్, సరస్వతిల కుమారుడు రాజా గవినితో హైదరాబాద్కు చెందిన గౌతమ్బుద్ద, శివలీల దంపతుల రెండో కుమార్తె దివ్యకు 2007 మే వివాహం జరిగింది. వివాహం అనంతరం రాజా, దివ్యలు అమెరికాలోని డల్లాస్లో స్థిరపడ్డారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో దివ్య ఉద్యోగం చేస్తుండగా, రాజా వెల్స్ఫోరోమెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల రియా అనే కూతురు ఉంది.
రాజా, దివ్యలకు అక్కడే ప్రేమ్నాథ్ అనే వ్యక్తి స్నేహితుడున్నాడు. ఈ క్రమంలో రాజా, దివ్యలు కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్నారు. అప్పటి నుంచి స్నేహితుడు ప్రేమ్నాథ్ ఇంట్లోనే వారు ఉంటున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 24వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో కూతురు రియాను డల్లాస్ నుంచి ఫ్రిస్కోలో ఉండే డ్యాన్స్ స్కూల్కు తీసుకెళ్లేందుకు రాజా, దివ్య, ప్రేమ్నాథ్లు కారులో వెళ్లారు. రియాను డ్యాన్స్ స్కూల్లో వదిలేసి తిరుగు ప్రయాణంలో వారు కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వద్దకకు వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత వారు ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ వారి కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో దివ్య, రాజా, ప్రేమ్నాథ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో హైదరాబాద్లోని దివ్య కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని దివ్య బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన పుట్టిన రోజునే దివ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తమను కలిచివేసిందని ఆమె తండ్రి గౌతమ్బుద్ధ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా దివ్య, రాజా, ప్రేమ్నాథ్ మృతదేహాలను శుక్రవారం హైదరాబాద్కు తరలించే అవకాశాలు ఉన్నాయని ముషీరాబాద్ సిఐ మురళీకృష్ణ తెలిపారు.