లక్నో: మాంసం వండిన విషయంలో గొడవ జరగడంతో నవ దంపతులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వధువు మృతి చెందగా వరుడి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖిమ్పూర్ ఖేరీ ప్రాంతంలోని ఇశాన్గర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జూన్ 12న గురుదయాల్ (22) అనే యువకుడు రేష్మిని (19) పెళ్లి చేసుకున్నాడు. రేష్మి చిన్నప్పటి నుంచి శాఖహారి కావడంతో మాంసం ముట్టదు. గురుదయాల్ ఇంటికి మాంసం తీసుకొని వచ్చాడు. మాంసం వాసన తనకు పడదని బయట వండాలని భర్తకు సూచించింది. దీంతో భర్త కూడా తన తల్లికి అదే విషయం చెప్పి దంపతులు బయటకు వెళ్లారు. ఇంట్లోకి వచ్చేసరికి గురుదయాల్ తల్లి ఇంట్లోనే మాంసం కూర వండడంతో ఎందుకు ఇలా చేశావని మందలించాడు. తల్లి, నవ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గురుదయాల్, రేష్మి విషం తాగారు. వెంటనే గురుదయాల్ తండ్రి ఆ దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాలని పరీక్షించిన వైద్యులు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో రేష్మి చనిపోగా గురుదయాల్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానిక పోలీస్ అధికారి సునీల్ సింగ్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో మాంసం వండడంతో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని చెప్పారు.