14గంటల్లో తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
హైదరాబాద్: కిడ్నాప్కు గురైన పాపను పోలీసులు ఆచూకీ తెలుసుకుని 14 గంటల్లో తిరిగి తల్లి వద్దకు చేర్చారు. ఈ సంఘటన నగరంలోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని సీతారంబాగ్, కట్టెలమండికి చెందిన లక్ష్మికి నాలుగు నెలల కూతురు రేణుక ఉంది. భర్త వదిలివేయడంతో తండ్రితో కలిసి ఉంటోంది. తండ్రి కూలి పనిచేస్తున్నాడు. మంగల్హాట్కు చెందిన నిందితులు లక్ష్మికి ఎవరూ లేరని గుర్తించారు.
ఆటో డ్రైవర్ షేక్ అలీం, భిక్షమెత్తుకునే ఆరిషియా, షేక్ సలీంలు పాపను కిడ్నాప్ చేసి బెగ్గింగ్ చేయించాలని ప్లాన్ వేశారు. చిన్న పిల్లను ఎత్తుకుని భిక్షమడుక్కుంటే చాలా మంది ఎక్కువగా డబ్బులు వేస్తారని అందరూ కలిసి భావించారు. దీంతో ఈ నెల 10వ తేదీ రాత్రి 11.30 గంటలకు లక్ష్మి వద్ద ఉన్న పాపను కిడ్నాప్ చేశారు. ఉదయం లేచి చూసేసరికి కూతురు కన్పించకపోవడంతో బాధితురాలు మంగల్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సిసిటివిలు, ట్రాఫిక్ పోలీసుల సాయంతో ఆటో నంబర్ టిఎస్13యూఏ 4872ను గుర్తించారు. ప్రధాన నిందితుడు షేక్ అలీంను అదుపులోకి తీసుకుని విచారించగా బాలిక ఆరిషియా వద్ద ఉన్నట్లు తెలిపాడు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్స్పెక్టర్ రణవీర్రెడ్డి పర్యవేక్షణలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, శివానందరం కేసు దర్యాప్తు చేశారు.