డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్
వాషింగ్టన్: ట్రంప్ కరోనా నుంచి కోలుకోకపోతే అక్టోబర్ 15న జరగాల్సిన రెండో డిబేట్ను వాయిదా వేయాల్సిందేనని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఏమిటో తనకు తెలియదని బిడెన్ అన్నారు. డిబేట్ రోజుకి ట్రంప్కు కరోనా ఉంటే మాత్రం చర్చ ఉండబోదని బిడెన్ అన్నారు. తాను క్లీవ్ల్యాండ్ క్లినిక్ నిబంధనలు అనుసరిస్తానని బిడెన్ తెలిపారు. వైద్య నిపుణుల సిఫారసు మేరకే డిబేట్ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తనకూ చర్చలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నా, నిబంధనలు పాటించక తప్పదని బిడెన్ అన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ ఇప్పటికే వైట్హౌస్కు చేరుకొని ఎన్నికల ప్రచారానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. వాల్టర్ రీడ్ మిలిటరీ మెడికల్ సెంటర్లో కరోనాకు చికిత్స తీసుకొని సోమవారమే ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. మరోవైపు బుధవారం(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) ఇరు పార్టీల ఉపాధ్యక్షుల మధ్య డిబేట్కు రంగం సిద్ధమైంది.