మెహబూబా ముఫ్తి ఆరోపణ
శ్రీనగర్: కశ్మీరు ఒక ఓపెన్ ఎయిర్ జైలని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అక్కడ ఎవరికీ లేదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి రోపించారు. శుక్రవారం ఉదయం తనను తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన అనంతరం ఆమె విలేకరులతో సమావేశం నిర్వహించడానికి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసిన తమ పార్టీ నాయకుడు వహీద్ పర్రాను కలుసుకోవడానికి పుల్వామా వెళ్లేందుకు అధికారులు తనను అనుమతించలేదని ఆమె తెలిపారు.
శ్రీనగర్లోని తన నివాసానికి మీడియాను కూడా అనుమతించడం లేదని, తనను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారో కూడా ఎవరి వద్ద లిఖిలపూర్వక ఆదేశాలు లేవని ఆమె పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి మండలి(డిడిసి) ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. శుక్రవారం ఉదయం ముఫ్తి మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఆమె ఇంటికి వంద మీటర్ల దూరంలోనే విలేకరులను పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముఫ్తి మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసుల స్పష్టం చేశారు.