హైదరాబాద్: విదేశాల్లో పనిచేసేందుకు జాబ్ వీసా ఇస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులపై నాంపల్లి, హుమాయున్నగర్, ఆసిఫ్నగర్, గోల్కొండ, చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని నాంపల్లి, రెడ్హిల్స్, భజార్ఘాట్కు చెందిన మహ్మద్ హసీబ్ అహ్మద్, అలియాస్ హసీబ్ ట్రావెల్ ఏజెంట్, రెంటల్ హౌస్ బ్రోకర్గా పనిచేస్తున్నాడు. నగరంలోని మల్లేపల్లి, బజార్ఘాట్కు చెందిన మహ్మద్ అహ్మద్ సులేమాన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గుజరాత్కు చెందిన షా వర్షాల్ అలియాస్ వర్షాల్ పరారీలో ఉన్నాడు. మహ్మద్ అసీబ్ అహ్మద్ అలియాస్ హసీబ్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. పలుచోట్ల ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. వచ్చే డబ్బులు విలాసాలకు సరిపోకవడంతో వీసా ప్రాసెస్ గురించి తెలియడంతో మరో స్నేహితుడితో కలిసి నకిలీ వీసాలు ఇస్తున్నాడు. వీరికి షా వర్షాల్ సాహకారంతో నకిలీ వీసాలు తయారు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా, ఒమన్, న్యూజీలాండ్, కువైట్, బహ్రేయిన్ తదితర దేశాలకు జాబ్ వీసా ఇప్పిస్తామని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.2లక్షల చొప్పున తీసుకున్నారు. వీరి మాటలు నమ్మి నిరుద్యోగులు డబ్బులు కట్టారు. మహ్మద్ హసీబ్ అహ్మద్ నిరుద్యోగులకు వీసా గురించి వివరించేవాడు. బాధితుల వద్ద నుంచి ఒరిజినల్ పాస్పోర్టును తీసుకుని నకిలీ జాబ్ వీసా కోసం గుజరాత్కు చెందిన వర్షాల్ను సంప్రదించేవారు. అతడు నకిలీ వీసా తయారు చేసి వాట్సాప్లో పంపించేవాడు. వాటిని హసీబ్ నిరుద్యోగులకు వాట్సాప్లో పంపించేవాడు. వాటిని చూపించి మిగతా డబ్బులు కట్టాలని బాధితులపై ఒత్తిడి తెచ్చేవాడు. డబ్బులు తీసుకున్న తర్వాత బాధితులు ఫోన్ చేసిన స్పందిచడం మానివేశారు. ఇలా 15 నుంచి 20మంది వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.