న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదటిరోజున టీకాలు వేయించుకున్నవారిలో ఇద్దరు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర మాజీమంత్రి, బిజెపి ప్రస్తుత ఎంపి మహేశ్శర్మ కాగా, మరొకరు టిఎంసి ఎంఎల్ఎ రవీంద్రనాథ్ ఛటర్జీ. యుపిలోని గౌతమ్బుద్ధనగర్ ఎంపి మహేశ్శర్మ వైద్యుడిగా శిక్షణ పొందిన డాక్టర్ కూడా. దాంతో,ఆయన నోయిడాలోని హాస్పిటల్లో ఉదయం 11 గంటలకు ఆరోగ్య కార్యకర్తగా టీకా తీసుకున్నారు. టీకా అనంతరం తాను బాగున్నానని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, అందరూ తప్పకుండా టీకాలు వేయించుకోవాలని ఆయన ట్విట్ చేశారు. బెంగాల్లోని కట్వా నియోజకవర్గం ఎంఎల్ఎ రవీంద్రనాథ్ఛటర్జీ అక్కడి పేషెంట్ల వెల్ఫేర్ కమిటీలో సభ్యుడైనందున టీకా వేయించుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో చేపట్టే టీకా పంపిణీ కార్యక్రమంపై ఇటీవల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ తొలి విడతలో ప్రజాప్రతినిధులకు టీకాలు వద్దని సూచించిన విషయం గమనార్హం.