భారత్ బయోటెక్ ప్రకటన
అంగీకార పత్రం తప్పనిసరి
హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని ఈ టీకాను తయారు చేసే భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కారణంగా ప్రతికూలతలు ఎదురైనట్లు రుజువైతే వైద్య సహాయం కూడా అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘ టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు ఎదురైతే అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బిబిఐఎల్ నష్టపరిహారం చెల్లిస్తుంది’ అని శనివారం నాడు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలియజేసింది.
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తీసుకునే వారు అంగీకార పత్రంపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. అ ఆంగీకార పత్రంలోనే నష్టపరిహారం చెల్లించే విషయం కూడా స్పష్టంగా పేర్కొన్నారు కూడా ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్లో కరోనా వైరస్కు వ్యతిరేకంగా యాంటీ బాడీస్ను తయారు చేసే సామర్థం కలిగి ఉందని నిరూపితమైవదని, అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా నిర్ధారణ కాలేదని ఆ అంగీకార పత్రంలో పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో శనివారం కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ కూడా ఉన్నారు.