Sunday, May 19, 2024

కోవిడ్ వేరియంట్లపై ‘వార్మ్ వ్యాక్సిన్’

- Advertisement -
- Advertisement -

Warm vaccine effective on all Covid variants

ఇండియా తయారీ… వేడిలోనూ చెడిపోదు
ఎలుకలలో ట్రయల్స్ విజయవంతం
మానవులపై ప్రయోగాలకు దరఖాస్తు

బెంగళూరు : అన్ని రకాల కరోనా తీవ్రస్థాయి వేరియంట్లపై టీకాబాణంగా ‘ వార్మ్ వ్యాక్సిన్’ దూసుకువస్తోంది. దేశంలో కోవిడ్ వివిధ రూపాలలోకి దిగి, మ్యుటేషన్స్‌తో ముప్పు తిప్పలు పెడుతున్న దశలో సకల వేరియంట్ల నివారక టీకా అవసరం ఏర్పడింది. ఈ దిశలో ఐఐఎస్‌సి బెంగళూరు, బయోటెక్ సంస్థ మైన్‌వాక్స్‌కు చెందిన సైంటిస్టులు కలిసి చేపట్టిన పరిశోధనల క్రమంలో ఈ వార్మ్ వ్యాక్సిన్ నమూనాలను రూపొందించారు. ఇప్పుడు సార్స్ కోవ్ 2 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ మనిషిని ఆరోగ్యపరంగా దెబ్బతీస్తున్నాయి. వీటిని విఒసి వేరియంట్లు అని వ్యవహరిస్తున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన సిఎస్‌ఐఆర్‌ఒ ఈ నమూనాలపై స్వతంత్రంగా విశ్లేషణ జరిపింది. ఈ సంస్థనే ఆక్స్‌ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ నమూనాలను కూడా గత ఏడాది పరిశీలించింది. వాటి పనితీరును పసికట్టింది. ఈ సంస్థ అధ్యయనాలను ఎసిఎస్ ఇన్‌ఫెక్షియస్ డిజిసెస్ జర్నల్‌లో సంక్షిప్తంగా పొందుపర్చారు. ఐఐఎస్‌సికి చెందిన ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నాయకత్వంలో అధ్యయన వివరాలను వెలువరించారు. ఈ వ్యాక్సిన్ రూపకల్పన సంబంధిత కార్యక్రమాలు గత ఏడాది నవంబర్ నుంచి సాగుతున్నాయి. వైరస్ నుంచి కాపాడే ఈ టీకా అత్యంత వేడి ఉష్ణోగ్రతలలో కూడా చెడిపోకుండా ఉంటుంది. 37 డిగ్రీస్ సెల్సియస్ వరకూ ఇది నెలరోజుల వరకూ స్థిరంగా ఉంటుంది. ఇక వంద డిగ్రీల స్థాయిలో ఇది 90 నిమిషాల వరకూ పనిచేస్తుందని తేల్చారు.

సమగ్రమైన ఇమ్యూనిటీ బలం

వార్మ్ వ్యాక్సిన్‌ను ముందుగా ఎలుకలలో ప్రయోగించి చూశారు. ఈ దశలో పటిష్ట స్థాయి రోగనిరోధక కణాలు ఆవిర్భవించినట్లు స్పష్టం అయిందని అధ్యయన పత్రంలో తెలిపారు. ఇప్పటి క్లినికల్ దశ ట్రయల్స్‌లో భాగంగా ఇకపై మనుష్యులలో కూడా టీకా నమూనాను ప్రయోగించి చూస్తారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరిగిన ప్రాణులలో వైరస్ నుంచి రక్షణ కవచం ఏర్పడినట్లు గుర్తించారు. ఇక ఈ టీకాల నిల్వలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు కూడా వాడకానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఐఐఎసి మైన్‌వాక్స్ రూపొందించిన టీకా నమూనాను సార్స్ వైరస్‌లోని ఎస్ ప్రోటీన్‌ను జన్యుపరంగా సమీకరింపచేసి రూపొందించారు. వైరస్ కారక ప్రోటీన్‌ను దెబ్బతీసి, మనుష్యుల శ్వాసపేటిక ప్రభావితం కాకుండా చేసేందుకు వీలుగా ఈ టీకాను రూపొందించారు.

మనుష్యులలో ట్రయల్స్ కీలకం

తమ తదుపరి కార్యాచరణ మనుష్యులలో ఈటీకాల పనితీరును పరిశీలించుకోవడం అని వరదరాజన్ తెలిపారు. ఇండియాలో మనుష్యులలో ఫేజ్ 1,2,3 దశలకు నిధుల విషయంలో భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి పరిస్థితులలో ఈ ట్రయల్స్‌కు కనీసం రూ 30 కోట్లు అవసరం అన్నారు. విఒసి వేరియంట్లు ప్రమాదకరంగా మారిన తరుణంలో వీటిని తటస్థీకరించే విధంగా ఈ టీకా ఫార్మూలా ఉండటం అత్యంత కీలక పరిణామం అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News