టోక్యో: భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 43 తేడాతో విజయం సాధించిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకుంది. అయితే భారత్ నాకౌట్కు చేరడంలో గ్రేట్ బ్రిటన్ కీలక పాత్ర పోషించింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో బ్రిటన్ విజయం సాధించడంతో భారత్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిచి ఉంటే భారత్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యేవి. ఇక సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. ఇదిలావుండగా 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. భారత హాకీ చరిత్రలో మూడోసారి మాత్రమే నాకౌట్కు అర్హత సాధించింది.
చివరి మూడు మ్యాచుల్లో ఓటమి పాలుకావడంతో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆశలు క్లిష్టంగా మారాయి. అయితే చివరి రెండు మ్యాచుల్లో మహిళా జట్టు విజయం సాధించి ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలపై విజయం సాధించి రేసులో నిలిచింది. చివరగా బ్రిటన్ తన ఆఖరు మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించడంతో భారత్కు నాకౌట్ ఛాన్స్ దక్కింది. అయితే క్వార్టర్ ఫైనల్లో భారత్కు కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి ఉంది. ఆస్ట్రేలియా అడ్డంకిని దాటి మహిళా జట్టు ముందుకు సాగితే భారత హాకీ చరిత్రలోనే అత్యంత అరుదైన విజయం సొంతమవుతుంది.
వందన హ్యాట్రిక్
మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 43 తేడాతో ఘన విజయం సాధించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ దూకుడును ప్రదర్శించింది. మరోవైపు ప్రత్యర్థి సౌతాఫ్రికా కూడా అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. దీంతో చివరి వరకు మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇక భారత్ విజయంలో వందన కతారియా కీలక పాత్ర పోషించింది. వందన హ్యాట్రిక్ గోల్స్తో భారత్కు చారిత్రక విజయం అందించింది. అంతేగాక భారత హాకీ ఒలింపిక్స్ చరిత్రలోనే హ్యాట్రిన్ నమోదు చేసిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో వందన ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ఆట నాలుగో నిమిషంలో వందన మొదటి గోల్ను సాధించింది.
తర్వాత భారత్ మరింత దూకుడును ప్రదర్శించింది. అయితే 15వ నిమిషంలో టారిన్ గ్లాస్బి సౌతాఫ్రికాకు తొలి గోల్ అందించి స్కోరును సమం చేసింది. కానీ ఆ వెంటనే వందన మరో గోల్ సాదించడంతో భారత్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దక్షిణాఫ్రికా 30వ నిమిషంలో మరో గోల్ సాధించి స్కోరును 22తో సమం చేసింది. ఎరిన్ హంటర్ ఈ గోల్ చేసింది. అయితే 32వ నిమిషంలో నేహా గోయల్ భారత్కు మూడో గోల్ను సాధించి పెట్టింది. కానీ ఈ ఆధిక్యాన్ని భారత్ ఎక్కువ సేపు కాపాడుకోలేక పోయింది. మారిజెన్ మారాస్ 39వ నిమిషంలో గోల్ చేయడంతో స్కోరు మళ్లీ సమమైంది. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందా అనిపించింది. కానీ 49వ నిమిషంలో వందన తన మూడో గోల్తో భారత్కు మళ్లీ పైచేయి అందించింది. దీన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్ 43తో మ్యాచ్ను గెలిచి నాకౌట్ రేసులో నిలిచింది.