ఏడుగురు కొత్తవారికి చోటు
చండీగఢ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్సింగ్ చన్ని సారధ్యంలో కొత్తమంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. మొత్తం 15 మంది ప్రమాణస్వీకారం చేయగా వారిలో ఏడుగురు కొత్తవారికి చోటు కల్పించారు. కాంగ్రెస్ ఎంఎల్ఎలు బ్రహ్మ మొహీంద్ర, మన్ప్రీత్ సింగ్ బాదల్, మంత్రులుగా మొదట ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరు కాక త్రిప్త్ ఎస్. బజ్వా, సఖ్బీందర్ సర్కారియా, రాణా గుర్జీత్సింగ్, అరుణచౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ ఆషు, విజయ్ ఇందర్ సింగ్లా, రణ్దీప్ ఎస్ సభా, రాజ్కుమార్ వెర్కా, సంగీత్ సింగ్ జిల్జియాన్, పర్గత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వార్దింగ్, గుర్కీరత్ సింగ్ కోట్లీ ఉన్నారు.
అయితే ఇసుక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాగుర్జీత్ సింగ్కు మంత్రి పదవి ఇవ్వవద్దని ఆరుగురు ఎమ్ఎల్ఎలు లేఖలు రాసినా, ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టేందుకే సిఎం చన్నీ, పిసిసి చీఫ్ సిద్దూ మొగ్గు చూపారు. రాణాగుర్జీత్ సింగ్, మొహీంద్ర, సింగ్లా ఈ ముగ్గురు అమరీందర్ సింగ్కు బాగా సన్నిహితులు. పంజాబ్ గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్ రాజ్భవన్లో కొత్త మంత్రులచే ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్, పిసిసి చీఫ్ సిద్ధూ , చీఫ్ సెక్రటరీ, డిజిపి తదితర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు కొలువు తీరిన కొత్త మంత్రి వర్గంలో యువతకు పెద్ద పీట వేస్తూ రాహుల్ ముద్ర చూపించారు.