మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే పేపర్ల మీద జీవోలు ఇవ్వడం కాదని మాజీ మంత్రి హరీష్రావుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాలేజీకి బిల్డింగ్లు ఉండాలి, ఎంబిబిఎస్ సీట్లకు అనుగుణంగా హాస్పిటల్ ఉండాలి..ఫాకల్టీ, హాస్పిటల్లో, కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి..విద్యార్థులకు హాస్టల్స్ ఉండాలి….ఇలా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తేనే కాలేజీ ఏర్పాటు చేసినట్టు అని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గాల్లో మేడలు, కాగితాలపై కాలేజీలను చూపించి, వైద్య విద్యను గత ప్రభుత్వం నాసిరకంగా మార్చిందని విమర్శించారు. సరైన ప్రణాళిక లేకుండా, ఫాకల్టీని నియమించకుండా, బిల్డింగులు కట్టకుండా, మౌలిక వసతులు కల్పించకుండా మెడికోల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు కాలేజీలకు ఎన్ఎంసీ నోటీసులు రాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ,
పిల్లలను తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా ట్వీట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ హయాంలో నోటీసులే రానట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టుగా వ్యవహరిస్తూ… హరీశ్రావు మరోసారి తన గోబెల్స్ మనస్తత్వాన్ని చాటుకున్నారని మంత్రి దామోదర విమర్శించారు. మీరు నాశనం చేసిన ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థను మేము గాడిలో పెడుతున్నామని హరీష్రావును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరలో ఆరోగ్యశాఖలో 8 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రతి కాలేజీకి, హాస్పిటల్కు బిల్డింగులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఫాకల్టీని నియమిస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీని కాపాడుకుంటామని, ఒక్క సీటు కూడా పోకుండా చర్యలు తీసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిది అని మంత్రి విద్యార్థులకు భరోసా ఇచ్చారు.