బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రతీ వార్డులో, పంచాయతీలో వందలాది నామినేషన్లు దాఖలు చేయిస్తామని స్పష్టం చేశారు. బంరాజాహిల్స్లోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఎల్సి కవిత మాట్లాడుతూ… ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సిఎం రేవంత్ రెడ్డి ఒక్క సారి కూడా బిసి బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించకపోవడం దారుణమని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నీస్ రికార్డు నమోదు ఖాయమని ఎద్దేవా చేశారు. మనస్ఫూర్తిగా బిసి బిల్లు ఆమోదానికి రేవంత్ రెడ్డి కృషి చేయడం లేదని ధ్వజమెత్తారు. బిసి బిల్లు కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బిజెపి యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బిసి బిల్లుకు మద్ధతివ్వకుండా ఎన్ని యాత్రలు చేసినా బిజెపిని ప్రజలు నమ్మరని తెలిపారు.
ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం జులై 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తామని ఎంఎల్సి కవిత వెల్లడించారు. జూలై 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము పిలుపునిచ్చిన రైల్ రోకో కార్యక్రమానికి ఆయా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు వస్తోందని తెలిపారు. ఎస్సి, ఎస్టి సంఘాలు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమానికి మద్దతిస్తున్నాయని వివరించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై సిఎం ఎందుకు మాట్లాడడం లేదు..?
గోదావరి జలాలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంఎల్సి కవిత మండిపడ్డారు. వృథా అవుతున్న గోదావరి నీటిని మన పొలాలకు మళ్లించుకోవాలన్నది కెసిఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. అందుకే తుపాలకులగూడెం వద్ద నుంచి గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని కెసిఆర్ వాదించారని అన్నారు. దీని వల్ల తెలంగాణలోని సగం తెలంగాణ జిల్లాలకు గోదావరి నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందని వివరించారు. పోలవరం నుంచి లింకేజీ ప్రతిపాదనను గతంలోనే జగన్ తెస్తే కెసిఆర్ వ్యతిరేకించారని చెప్పారు. చంద్రబాబు ఎన్డిఎలో భాగస్వామిగా ఉన్నారు
కాబట్టి తెలివిగా గోదావరి కావేరి అనుసంధానం అని చెప్పి 60 శాతం కేంద్రం నిధులతో ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నం చేస్తుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. ఫ్లైట్ మోడ్ సిఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్ప మన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు సాధించలేకపోతున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు..? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లాలూచి ఏమిటో చెప్పాలని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఎపి ప్రభుత్వం పీఎఫ్ఆర్ సమర్పించినా సిఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమని, తెలంగాణకు రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
తెలంగాణ జాగృతి తరఫున న్యాయపోరాటం చేస్తాం
గోదావరి – బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా 150 టిఎంసిల సామర్థ్యంతో బొల్లాపల్లి వద్ద భారీ రిజర్వాయర్ నిర్మించి నల్లమల అడవిని ముంచేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ జాగృతి తరఫున న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. రేవంత్రెడ్డి నిజంగా నల్లమల పులి బిడ్డ అయితే బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోవాలంటూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం డిమాండ్ చేయాలని వ్యాఖ్యానించారు.
సిఎం రేవంత్ రెడ్డి స్పందించకుండా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని ప్రజంటేషన్లు ఇచ్చినా బనకచర్ల ప్రాజెక్టు ఆగదని పేర్కొన్నారు. నిజంగా ప్రాజెక్టును అడ్డుకోవాలంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం లొల్లి పెట్టాలని సూచించారు. ఆపరేషన్ కగార్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఈ మారణకాండను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి మృతి పట్ల ఎంఎల్సి కవిత సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.