ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? కొత్త ట్రైబ్యునల్
వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు సముద్రంలో
కలిసే నీళ్లు వాడుకుంటే అభ్యంతరం ఎందుకు అమరావతిలో మీడియా సమావేశంలో ఎపి సిఎం చంద్రబాబు
ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు ప్రశ్నించారు. గురువారం అమరావతి సచివాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని చెప్పారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదు.
కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని సూచించారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయి. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అన్నారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని చెప్పారు.
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు : తెలంగాణ పై భాగంలో ఉందని, కింద ఉన్న ఏపీ నీళ్లు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు, అభ్యంతరాలు ఎందుకు అని అడిగారు. తెలంగాణలోనూ ప్రాజెక్టులు కట్టాలని, ప్రజలు, రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటాను కానీ ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు చంద్రబాబు సూచించారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు.
కాగా బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. నాడు కేసీఆర్, జగన్ కలిసి రాయలసీమకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.