Tuesday, August 5, 2025

నువ్వు భారతీయుడివేనా..?: రాహుల్‌పై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేతను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం.. నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది. రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వాదించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మానిహ్‌లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంట్‌లో మాట్లాడాలని, సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇటువంటి సమస్యలను పార్లమెంట్‌లో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది. 2022లో దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“2020 జూన్‌లో లడఖ్ లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ సమయంలో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్నిచైనా స్వాధీనం చేసుకుంది. ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువ. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరు. అరుణాచల్ ప్రదేశ్‌లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ భూభాగాన్ని తిరిగి ఇవ్వాలంటూ మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోడీ ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్నారు. ఆక్రమణే జరగలేదంటున్నారు. దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదు. ఇది నిజం కాదా ? ఇదంతా యావత్ దేశం గమనిస్తోంది” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాహుల్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ 2022లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News