మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పెంచాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కోరారు. మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో మంగళ వారం సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్తో కలసి ఆమె కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ఏడాది కేంద్రం 12 కోట్ల పని దినాలు మంజూరు చేసినప్పటికీ, ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయడం గ్రామీణాభివృద్ధికి అడ్డంకిగా మారిందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఉపాధిపై ఆంక్షలు లేకుండా నిధులను పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. సీతక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎంపి కనిమొళిని కలిసిన సీతక్క
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి మంగళవారం ఢిల్లీలో డిఎంకె ఎంపి కనిమొళిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను ఒకరికొకరు తెలుసుకున్నారు. సీతక్కను తమిళనాడుకు రావాలని కనిమొళి ఆహ్వానించారు.