Saturday, September 20, 2025

బీహార్‌లో నువ్వానేనా?

- Advertisement -
- Advertisement -

జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే బీహార్‌లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డిఎ, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్‌డిఎ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వల్పంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడి కావడంతో ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.

2025 అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 41 నుండి 44%, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడి 30 నుండి 31 శాతం ఓట్లతో, బిజెపి 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్ /మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

బీహార్ లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్‌డిఎ, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37% ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్‌జెడి 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బిజెపి 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండోస్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్‌లో గతంలోవలే మరోసారి ఎన్‌డిఎ, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బిజెపి, జెడి(యు), హెచ్‌ఎఎమ్, ఎల్‌జెపి (ఆర్వీ), ఆర్‌ఎల్‌ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్‌డిఎ కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఇబిసి, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్‌లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి.

కాంగ్రెస్, ఆర్‌జెడి, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఒబిసి వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010), ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈసారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతోపాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్‌డిఎకు కలిసి వస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సిడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు.

ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎంఎల్‌ఎల పనితీరుతోపాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈసారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు.

ఎన్‌డిఎకు మద్దతుగా ఉన్న ఇబిసి ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పిడిఎ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్‌లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్‌డిఎ, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళలకోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద రూ. 10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ. 2 లక్షల రుణాలిస్తామని ఎన్‌డిఎ హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్‌డిఎ మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

రాష్ట్రంలో ట్రైబెల్స్‌కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్‌డిఎ హామీ ఇచ్చింది. ఎన్‌డిఎ హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ. 2500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటిఐ ఏర్పాటు చేస్తామని ఆర్‌జెడి హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ. 2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్‌లో ఆర్‌జెడి గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్‌డిఎ మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్న పార్టీలైన హెచ్‌ఎఎమ్, ఆర్‌ఎల్‌ఎమ్ ఎన్‌డిఎ కూటమిలో,విఐపి, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బిజెపి 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది.

30 నుండి 31% ఓట్లతో బలంగా ఉన్న ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగామారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జెడి(యు) ఇబిసి సామాజికవర్గంలో బలం గా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌జెపి(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్‌డిఎలో చీలిక భయాలున్నాయి.జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.

Also Read : వచ్చే నెలలో మోడీ, ట్రంప్ భేటీ

  • దిలీప్‌రెడ్డి ( సమకాలీనం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News