షార్ట్- సెల్లింగ్లో 24 జనవరి 2023న ప్రత్యేకత కలిగిన హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ షేరు ధర పడిపోతుందనే అంచనాతో దాని ధరపై పందెం వేయడం – అదానీ గ్రూప్ అకౌంటింగ్ అక్రమాలు, స్టాక్ మానిప్యులేషన్, షేర్ ధరలను పెంచడానికి ఆఫ్ షోర్ షెల్ కంపెనీలను ఉపయోగించిందని ఆరోపిస్తూ 106 పేజీల నివేదికను ప్రచురించింది. గత వారం ఈ ఆరోపణలలో కొన్నింటిని సెబీ తోసిపుచ్చింది. దాని నిబంధనల ప్రకారం అదానీ కంపెనీలు, సంబంధిత పార్టీల మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు. అందువల్ల, పెట్టుబడిదారులకు బహిర్గతం చేయవలసిన అవసరం లేదు. అవి మార్కెట్ మానిప్యులేషన్కు కారణమని పేర్కొంది. డబ్బులు దారి మళ్లించినట్లు లేదా నిధులను మళ్లించినట్లు లేదా పెట్టుబడిదారులు డబ్బును కోల్పోయినట్లు ఎటువంటి ఆరోపణలు లేవని కూడా సెబీ పేర్కొంది. అదానీ కంపెనీలు ఏదైనా సంస్థ నుండి తీసుకున్న రుణాలను దర్యాప్తు ప్రారంభానికి ముందే తిరిగి చెల్లించారని కూడా సెబీ పేర్కొంది. యోగ్యత ఆధారంగా, నిందించబడిన లావాదేవీలను తారుమారు లేదా మోసపూరిత లావాదేవీలు లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతులుగా వర్గీకరించలేమని కూడా నిర్ధారించబడింది.
రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, సెబీ అదానీ సంస్థలపై రెండు అభియోగాలను తొలగించింది, కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ నుండి పబ్లిక్ ఫ్లోట్ ఉల్లంఘనల వరకు 22 కేసులు పెండింగ్లో ఉన్నాయి. గత సంవత్సరం, షార్ట్-సెల్లర్ సెబీ మాజీ చీఫ్ మాధబి పూరి బుచ్ అదానీ గ్రూప్ ఉపయోగించే ఆఫ్షోర్ నిధులతో సంబంధాలు కలిగి ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మే నెలలో భారతదేశ అవినీతి నిరోధక వాచ్డాగ్ హిండేబర్గ్ ఆరోపణల ఆధారంగా ఆమెపై మోపబడిన అన్ని అవినీతి ఆరోపణల నుంచి ఆమెను తొలగించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, హిండేబర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకురాలు నేట్ ఆండర్సన్, కంపెనీని ప్రారంభించిన ఎనిమిది సంవత్సరాల తర్వాత దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదికతో ప్రపంచం యావత్తూ గగ్గోలు పెట్టగా సెబీ ఆ కీలక ఆరోపణల్ని తోసిపుచ్చడం దారుణం. భారతదేశంలోని అతి ముఖ్యమైన రెగ్యులేటరీ సంస్థ సైతం అదానీ తదితర కార్పొరేట్లకు అనుకూలంగా మారిందనడానికిది తాజా తార్కాణం. అదానీపై హిండెన్బర్గ్ ఆరోపణలు నిరూపణ కాలేదు. అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఆ సంస్థపై జరిమానా విధించాల్సిన అవసరం లేదు అని సెబీ హోల్ టైం మెంబర్ కమలేష్ చంద్ర వర్షనేరు తన ఆర్డర్లో పేర్కొనడం దిగజారుడు తనానికి నిదర్శనం. దీంతో అదానీ పవర్, గౌతం అదానీ, రాజేష్ అదానీలపై కొనసాగుతున్న దర్యాప్తు కార్యకలాపాలకు సెబీ మంగళం పాడింది.
అదానీ గ్రూప్ తన కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి, షేర్ల ధరలను కృత్రిమంగా మార్చడానికి విదేశీ బినామీ, షెల్ కంపెనీలను వాడుకుందని, అదానీ తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని అప్పట్లో వెల్లడించింది. ఆ దెబ్బతో ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపు కంపెనీల విలువ దాదాపు లక్షల కోట్లు హరించుకుపోయింది. అదానీ ఆర్థిక అక్రమాలను నిశితంగా పరిశీలించామని, సాక్ష్యాలను సంపాదించామని, దాదాపు 100 పేజీల సాక్ష్యాలను రిపోర్ట్లో హిండెన్బర్గ్ పేర్కొంది. అయినా అవేవీ సెబీ విచారణలో అక్కరకు రాలేదు లేదా వాటిని చూడ నిరాకరించినట్టుంది. ఏలినవారి మద్దతుగల శతకోటీశ్వరుడు తప్పు చేశారనీ, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారనీ సెబీ చెప్పగలదా? ముమ్మాటికీ అలాంటిది అసంభవమని గత పదేళ్ల చరిత్ర చెబుతోంది. అప్పటి సెబీ చైర్పర్సన్ మాధాబి పురీ బుచ్కు అదానీ గ్రూపు సంస్థలతో ఉన్న అక్రమ ఆర్థిక సంబంధాన్ని సైతం హిండెన్బర్గ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం అంటూనే బెర్ముడా, మారిషస్ వంటి అఫ్ షోర్ కంపెనీల్లో, అందునా గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు బుచ్ ఫ్యామిలీ అంగీకరించిన విషయం లోకానికెరుకే! తన భర్త బాల్య స్నేహితుడు నిర్వహిస్తున్న ఫండ్లోనూ పెట్టుబడులు పెట్టారని మాధాబి అప్పట్లో ధ్రువీకరించారు.
‘అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ చైర్మన్కు వాటిల్లో వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయి. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుంది’ అని హిండెన్బర్గ్ ఆరోపించింది. అదానీ కంపెనీలతో సెబీ మాజీ చైర్పర్సన్ మాధాబి చరిత్ర ఇదే. దేశంలో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక వ్యవహారాలను నియంత్రించవలసిన సంస్థకు అధినేతలుగా అటువంటి వ్యక్తులను నియమించడంలోనే అసలు తిరకాసు ఉంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు క్రమంలో దేశంలో కార్పొరేట్లు, బ్యురోక్రాట్లు, రాజకీయ నాయకుల మధ్య బలమైన బంధం ఏర్పడింది. ఆ బంధం గత పదకొండేళ్ల నరేంద్ర మోడీ పాలనలో మరింతగా బలపడింది. అందుకే ఈ మూడు తరగతులకు చెందినవారు ఒకరినొకరు సమర్ధించుకోవడం రివాజుగా మారింది. తాజా అంశం వాటిలో ఒకటి మాత్రమే! అదానీ సెకీ కుంభకోణం గురించి ఒకసారి గుర్తు తెచ్చుకున్నా ఈ విషయం అర్థం అవుతుంది. అదానీ గ్రూపు కార్పొరేట్లు, సెకీ, రాష్ట్ర విద్యుత్ రంగ ఉన్నతాధికారులు అప్పటి ప్రభుత్వాధినేతతో జరిపిన మంతనాలు, వేల కోట్ల రూపాయలు చేతులు మారడం, ఇవన్నీ ఒక్కసారి సినిమా రీల్ మాదిరి తిరుగుతాయి.
Also Read: మాటలతో కాదు.. చేతలతోనే మేకిన్ ఇండియా సాకారం
ఎం. సురేష్ బాబు
99899 88912