ఇందిరపై అనర్హత వేటు: సిజెఐ
అలహాబాద్ : 1975 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు దేశ చరిత్రను మార్చిందని, నిష్పక్షపాత న్యాయవ్యవస్థల స్వరూపాన్ని చాటిందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తెలిపారు. ఇక్కడ హైకోర్టు నూతన భవన ప్రాంగణ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. అప్పటి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగ్మోహన్లాల్ సిన్హా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై వచ్చిన ఎన్నికల అక్రమాల అభియోగాలపై విచారణ తరువాత ఎంతో ధైర్యంగా తీర్పు వెలువరించారని, ప్రధాని ఇందిరపై అనర్హత వేటు వేశారని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనాత్మకం అయింది. అత్యయిక పరిస్థితి విధింపునకు దారితీసిందని అన్నారు.
ఈ విధంగా అలహాబాద్ హైకోర్టు ఉన్నత ప్రమాణాల తీర్పులను సంతరించుకుని ఉన్న 150 ఏళ్ల చరిత్రను సంతరించుకుందని తెలిపారు. ప్రధాని ఇందిరను అనర్హురాలిగా ప్రకటించడం ద్వారా న్యాయమూర్తి తమ ధైర్యాన్ని చాటుకున్నారన్నారు. తరువాత దేశంలో ఎటువంటి పరిణామాలు జరిగాయనే అంశం జోలికి తాను వెళ్లదల్చుకోలేదన్నారు. అలహాబాద్ హైకోర్టు నుంచి ఎందరో ప్రఖ్యాత న్యాయవాదులు, న్యాయమూర్తులు సేవలను అందించారని గుర్తు చేశారు. హైకోర్టు ఆవరణలో దివంగత ప్రముఖ న్యాయవాది ఆనంద్ భూషణ్ శరన్ చిత్రపటాన్ని ఈ సందర్భంగానే ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు.