రాకాసి కన్నుతో దూసుకొచ్చింది
తీరాన్ని తాకిన ఎంఫాన్ తుపాన్
గంటకు 190 కిమీల వేగం
కుండపోత వర్షాలతో భీభత్సం
కూలిన చెట్లు, స్తంభాలు
ఆరులక్షల మంది తరలింపు
కోల్కతా/ భువనేశ్వర్ / న్యూఢిల్లీ : జనాన్ని భయకంపితం చేస్తూ ఎంఫాన్ తుపాన్ బుధవారం బెంగాల్ తీరాన్ని తాకింది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో విరుచుకుపడ్డ ఈ తుపాన్తో పశ్చిమ బెంగాల్, ఒడిషాలకు తీవ్రనష్టం వాటిల్లింది. సముద్ర కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ ఉండటంతో తీరం వెంబడి ఉండే నివాసిత ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో ఆరున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ధాటికి చోటుచేసుకున్న ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. మధ్యాహ్నం 3.30 నుంచి ఆరున్నర మధ్యలో వివిధ పరిణామాలు, భూ ఉపరితలం, సముద్రం మధ్య దోబూచులాట రీతిలో చెలరేగిన తుపాన్ తీరం దాటింది. దీనితో పశ్చిమ బెంగాల్, ఒడిషా తీర ప్రాంతం బాగా దెబ్బతింది.
తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతం, లోతట్టు ప్రాంతాలలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవితం అస్థవ్యస్థం అయిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం రెండున్నరకు పశ్చిమ బెంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్లోని హతీయా దీవి మధ్య తుపాన్ కేంద్రీకృతం అయింది. తరువాత తీవ్రరూపంతో దిశ మార్చుకుని కోస్తా ప్రాంతాల వైపు మలుపులు తిరుగుతూ వెళ్లడంతో మార్గమధ్యంలో అనే చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పరిస్థితి తీవ్రతను గమనించి అధికారులు బెంగాల్, ఒడిషాలలో ఆరున్నర లక్షల మందిని తరలించారు. తుపాన్ కేంద్ర భాగం లేదా కన్ను తీవ్రస్థాయిలో ఉంది. తుపాన్ భూమిని తాకే సమయంలో గాలుల వేగం ఆరంభంలోనే గంటకు 160 170 కిలోమీటర్లు ఉందని, తరువాత దశలో ఇది గంటకు 190 కిలోమీటర్ల స్థాయికి చేరిందని వాతావరణ విభాగం తెలిపింది.
ఇద్దరు మహిళల దుర్మరణం
తుపాన్ ధాటికి చెట్లు కూలిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. హౌరా, నార్త్ 24 పరగణా జిల్లాలో జరిగిన ఈ ఘటనతో విషాదం నెలకొంది. ఒడిషాలో రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులను శుభ్రం చేసేందుకు విపత్తు నిర్వహణ దళానికి చెందిన 20 బృందాలు చేరుకున్నట్లు దేశ రాజధానిలో ఎన్డిఆర్ఎఫ్ అధినేత ఎస్ఎన్ ప్రధాన్ విలేకరులకు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో సహాయ చర్యల కోసం 19 యూనిట్లను పంపించారు. నష్టం పశ్చిమబెంగాల్లోనే ఎక్కువగా జరిగింది. అక్కడ ఐదు లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిషాలో దాదాపు రెండు లక్షల మందిని తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు. తుపాన్ నేలను తాకే సమయంలో సముద్ర అలలు భారీ స్థాయిలో విరుచుకుపడుతున్న దృశ్యాలు టీవీలలో ప్రసారం చేశారు.
రెండు రాష్ట్రాలలో చాలా సేపటివరకూ దట్టమైన మబ్బు పట్టి భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల మట్టి, పూరిళ్లు కొట్టుకుపొయ్యాయి. తుపాన్ పరిస్థితి, కదలికల గురిం చి వాతావరణ విభాగం (ఐఎండి) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర కూడా ప్రధాన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇది రాకాసి తుపానే అని మహాపాత్ర తెలిపారు. తుపాన్ కన్నే 30 కిలోమీటర్ల వెడల్పుతో ఉందని, దీని ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం రాత్రి వరకే తుపాన్ కోల్కతా చేరుకుంది. విధ్వంసం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో ఒడిషాలోని పూరి, కటక్, కేంద్రపారా, జాజ్పూర్, గంజాం, బాలాసోర్ జిల్లాలో మంగళవారం నుంచే వర్షాలు పడుతున్నాయి
ఆకాశపు భీకరం
అం పన్ అనేది థాయ్ పదం, దీనికి ఆకాశం అనే అర్థం ఉంది. ఆకాశం నుంచి పుట్టుకొచ్చిన జల విలయంగా దీనికి అంపన్ అనే పేరు పెట్టారు. ప్రతి తుపాన్కు ఓ పేరు పెట్టే ఆనవాయితీ ఉంది.