Thursday, May 2, 2024

కేంద్రంలో ఓబిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -
పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ : దేశంలో మెజారిటీ జనాభా ఉన్న ఓబిసిల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో కుల గణనను లెక్కించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో అన్ని యూనివర్సిటీలకు చెందిన విద్యార్ధులు, మేధావులు, సామాజిక వేత్తలు కూడా ఇలా డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. జూలై 15వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కన్వెన్షన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ ఓబిసి ఇష్యూస్ పై రూపొందించిన వాల్ పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల గణాంకాల్లో కుల గణన అప్షన్ పెట్టడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా కుల గణన చేపట్టవచ్చు అని పేర్కొన్నారు. ఓబిసి వర్గానికి చెందిన ప్రధానమంత్రి ఉన్నా ఓబిసిలకు ఒరిగిందేమీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిసి, ఎస్‌సి, గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎన్నో పథకాలు చేపట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ కూడా కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, అయినా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

దేశంలో ఓబిసి వర్గాల ప్రజలు, విద్యార్ధులు , మేధావులు, సామాజిక వేత్తలు ఐక్యంగా ఉండి ఓబిసిల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బిసిల స్థితిగతులు, వృత్తులు ఎవరి చేతులలో ఉన్నదీ, జనాభా పరంగా రిజర్వేషన్లు అందించటానికి వివరాలు కుల గణన వల్లే సాధ్యమన్నారు. అంతే కాకుండా ఓబిసిల ఆర్థిక స్థితిగతులు కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే .. దేశంలో బిసిల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. దేశంలో ఓబిసిల లెక్కలు తేల్చాలని యూనివర్సిటీ విద్యార్ధులు చేస్తున్న ఆందోళనను మంత్రి సమర్థించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ది సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News