Tuesday, April 30, 2024

మరో నాన్‌స్టాప్ ప్రయాణం మార్గం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః నగర వాసులకు మరో నాన్ స్టాప్ ప్రయాణం మార్గం అందుబాటులోకి రానుంది. నగరంలోనే అత్యంత పొడవైన ఇందిరాపార్క్, విఎస్‌టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది. పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఈ స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తుండడం, దీంతో జనాభాతో పాటుగా వాహనాల వినియోగం రెట్టింపు కావడంతో నగంలో నెలకొన్న పద్మవ్యూహాం లాంటి ట్రాఫిక్‌ను నివారించేందుకు ఆధునిక రోడ్డు రవాణా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా నగరవాసులకు సిగ్నల్ రహిత ప్రయాణంతో పాటు దూర భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితంగా తమతమ గమ్యాస్థానాలకు చేరుకోవడమే లక్షంగా రోడ్ల అభివృద్దిని చేపట్టింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రోద్బలంతో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు కృషి ఫలితంగా ఏర్పాటైన వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డిపి) ద్వారా జిహెచ్‌ఎంసి ఖర్చుకు ఏ మాత్రం వెనుకడకుండా మొదటి దశ కింద 45 ప్రాజెక్టులను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌డిపి ద్వారా చేపట్టిన పలు ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 45పనులు చేపట్టగా ఇప్పటి వరకు 35 పనులు పూర్తి పూరైయ్యాయి, ఇందులో 19 ఫ్లైఓవర్ లు, 5 అండర్ పాస్ లు, 7 ఆర్‌ఓబి, ఆర్‌యుబిలు, 1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రోడ్డు వెడలు తదితర ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.36వ ప్రాజెక్టు రూపంలో ఇందిరా పార్కు వి.ఎస్.టి స్టీల్ బ్రిడ్జి 20వ ఫ్లై ఓవర్ నేడు ప్రారంభం కానుంది. మిగిలిన 12 పనులు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయనున్నారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత
హైదరాబాద్ లో ఎస్.ఆర్.డి.పి ద్వారా రూ.450 కోట్ల వ్యయం తో చేపట్టిన మొట్ట మొదటి స్టీల్ ఫ్లై ఓవర్ గా నిలవనున్నది. మిగితా ఫ్లై ఓవర్ ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్ తో ఫ్లై ఓవర్ ను పూర్తి చేశారు.మొట్ట మొదటి సారిగా మెట్రో బ్రిడ్జి పై నుండి ఫ్లై ఓవర్ చేపట్టడం జరిగింది. ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి సివిల్ వర్క్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ. 450 కోట్ల వెచ్చించారు.

ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి స్టీల్ బ్రిడ్జి ప్లై ఓవర్ పొడవు 2.62 కిలోమీటర్లు కాగా, ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు కాగా అప్ ర్యాంపు 0.106 కి మి, 0.150 కి, డౌన్ ర్యాంపు 0.078 కి.మి. అదేవిధంగా రైట్ వే 22.20 మీటర్ల నుండి36.60 మీటర్ల కాగా, ఎలివేటెడ్ కారిడార్ కుడి వైపు మార్గం 4 లైన్ల బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్(16.60 మీటర్లు,).ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులో రావడంతో ఇందిరాపార్క్ జంక్షన్ మొదలు అశోక్ నగర్, అర్‌టిసి క్రాస్ రోడ్ మీదగా సిగ్నల్ రహిత బాగ్ లింగంపల్లి విఎస్‌టి జంక్షన్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత ప్రయాణంఅందుబాటులోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News