Tuesday, April 30, 2024

పొరుగుపై ఫోకస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని ఏర్పాటు పూర్తయ్యాయి. నేడు వైకుంఠ ఏకాదశి ఆ పార్టీలో చేరేందుకు ఇదే మంచి ముహూర్తంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో వారంతా తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కండువా కప్పుకోనున్నారు. వారిలో మాజీ ఐఎఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి రావెల కిషోర్‌బాబు, మరో మాజీ ఐఆర్‌ఎస్ అధికారి చింతల పార్థసారధితో పాటు ప్రజారాజ్యం పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన అనంతపురం నివాసి,ప్రముఖ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తుమ్మలశెట్టి జయప్రకాశ్ నారాయణ తదితరులు ఉన్నారు. వారితో పాటు మరికొంత మంది కూ డా చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కాగా బిఆర్‌ఎస్‌లో చేరుతున్న రావెల కిషోర్‌కు మంత్రిగా కొనసాగిన అనుభవం ఉం ది. 2014 నుంచి 2019 వరకు అప్పటి టిడిపి ప్రభుత్వ హయంలో ఆయన మంత్రిగా కొనసాగారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయా రు. తదనంతరం వైసిపిలో చే రారు. ఆ పార్టీలో కొన్నాళ్ల కొనసాగిన రావెల క్కడ ఇమడలేక బయటకు వ చ్చారు. ప్రస్తుతం కెసిఆర్ నే తృత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ అస లు సిసలైన రాజకీయ వేదికగా ఆయన భావిస్తున్నారు. నేపథ్యం లో కెసిఆర్ నేతృత్వంలో పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా పార్థసారధి జనసేన పార్టీ నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ సీటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక మరో రిటైర్డ్ అధికారి తోట చంద్రశేఖర్‌రావు కూడా జనసేనలో కీలకనేతగా కొనసాగుతున్నారు. గతంలో వైసిపిలో పని చేశారు. 2014లో ఏలూరు లోక్ సభ నుంచి వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగి.. టిడిపి అభ్యర్థి మాగంటిబాబు చేతిలో పరాజయం పాలయ్యారు.

ఆ తరువాత జనసేనలో చేరా రు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి నా ఫలితం దక్కలేదు. అలాగే అనంతపూర్‌లో బలిజ (కాపు) వర్గానికి చెందిన బలమైన నాయకుడైన జయ ప్రకాశ్ నారాయణ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపూర్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమారు 30వేలకు పైగా ఓట్లు సాధించారు. ప్రస్తుతం కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూ రంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఆలోచనలు, రాజకీయ విధానా లు, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయన కూడా నేడు కెసిఆర్ సమక్షంలో గులాబీ కుండువా కప్పుకోనున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా జాతీయస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన కెసిఆర్ తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలను పదునుపెడుతున్నారు. బిజెపియేతర పార్టీలను కలుపుకుని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జతకట్టే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.

ఇందులో భాగంగా భావస్వారూప్యత కలిగిన పార్టీలతో ఒకవైపు స్నేహం కొనసాగిస్తూనే అన్ని రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది, ఉత్తరాది అన్న తేడాలేకుండా అన్ని రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌కు మంచి ఆధారణ లభిస్తోంది. ఆ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ముందుకు వస్తున్నారు. వారిలో ఇప్పటికే కొందరు బిఆర్‌ఎస్‌లో చేరగా, త్వరలోనే గులాబీ కుండువా కప్పుకునేందుకు రంగం సిద్ధ్దం చేసుకుంటున్నారు.
ఎపిలో పాగాకు పక్కా ప్రణాళికలు
ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకు మరో సంవత్సరంన్నర వ్యవధి మాత్రమే ఉండడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేయాలని కెసిఆర్ చాలా గట్టిగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎపిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 2014 వరకు ఉమ్మడి ఎపి రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా ఆంధ్రా చెందిన అనేక మంది నాయకులతోనూ కెసిఆర్‌కు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. తనకున్న రాజకీయ పలుకుబడితో శరవేగంగా ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పాగా వేసేందుకు ప్రణాళికలను అమలు చేస్తున్నా రు. ఇందులో భాగంగానే ఎపి నుంచి పలువురు మాజీ అధికారులు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఎపి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర నేతలతో తలసానికి కూడా మంచి సంబంధాలున్నాయి. ప్రతి ఏటా సంక్రాం తి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో జరిగే సం క్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే పలు రకాల సంబురాలకు ఆయన హాజరువుతుంటారు. దీంతో ఆయనకు ఎపికి చెందిన టిడిపి, వైసిపి, కాంగ్రెస్, బిజెపి నేతలతోనూ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత అనేక రాష్ట్రాల్లోనూ రాజకీయాల్లో కదలికలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎపి, కర్నాటక, మహరాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి చేరికలు త్వరలోనే పెద్దఎత్తున ఉండబోతున్నట్లుగా బిఆర్‌ఎస్‌లో జోరుగా ప్రచారం కూడా సాగుతోంది.
ఎపి భవిష్యత్‌కు బంగారు బాట
ఎపి నుంచి పలువురు అధికారులు, నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నేతల నిర్ణయంతో ఎపి భవిష్యత్‌కు బంగారు బాటలు పడ్డాయని వ్యాఖ్యానించారు. గడిచిన తొమ్మిదేండ్లలో చంద్రబాబు, జగన్ అధ్వాన్న పాలనతో రాష్ట్రంలోని అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయన్నారు. యువతతో పాటు రైతులు విద్యార్థులు మహిళలు అన్నివర్గాలు తీరని అన్యాయానికి గురయ్యారని వ్యవసాయ, సంక్షేమ రంగాలతో పాటు అన్నిరంగాలు విధ్వంసానికి గురయ్యాయని ఆరోపించారు. అన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆదుకొనే నాయకుడు లేక అల్లాడుతున్నదని చారిత్రక ఉద్యమనేతగా పరిపాలన ధక్షుడిగా సకల జనుల సంక్షేమం దిశగా పాలన వ్యవస్థను తీర్చిదిద్దిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వంటి నాయకుడి ద్వారానే ఎపి రాష్ట్ర సమస్యలు తీరి అభివృద్ధి చెందుతుందన్నారు.

మోడీ అన్యాయమైన విధానాలను ఎదిరించి సకల సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కించే ఏకైక నేత కెసిఆర్ మాత్రమేనన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కెసిఆర్ నాయకత్వంలో దండుగా కదలడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎపి రాష్ట్రంలోనూ బిఆర్‌ఎస్ జెండా వాడవాడలా రెపరెపలాడి తీరుతుందన్నారు. ఆ దిశగా నిర్ణయం తీసుకొని కదిలిన హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ చేరుతున్న ఎపి నాయకుల నిర్ణయం కొత్త చరిత్రకు నాంది పలుకుతుందన్నారు. వారందరికీ ఎపి యూత్ అండ్ స్టూడెంట్స్ జెఎసి పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు జగదీశ్ పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తోట
ఎపి బిఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌రావును నియమించనున్నారు. ఈ మేరకు ఆయనకు కెసిఆర్ నుంటి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లుగా సమాచారం. కాగా తోటను బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా- ఎపిలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కెసిఆర్ వ్యూహం రచించారు. ఈ నేపథ్యంలో తోట గుంటూరులోని ఆరండంల్ పేట నుంచి భారీఎత్తున ర్యాలీతో హైదరాబాద్‌కు వస్తున్నారు. తనతో పాటు జనసేన పార్టీ నుంచి పెద్దఎత్తున నేతలను బిఆర్‌ఎస్‌లోకి తోట చంద్రశేఖర్‌రావు తీసుకవస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కెసిఆర్‌తో బిఆర్‌ఎస్‌లో చేరే నేతల జాబితాను కూడా పంపినట్లుగా తెలుస్తోంది.
‘తోట’కు అభినందనలు
భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఎపిపార్టీ అధ్యక్షులుగా నియమతులవుతున్న మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌రావుకు ఆ రాష్ట్రానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు. వారిలో తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన నాయకులు జి .రాధాకృష్ణ (కన్నబాబు)- ఎన్. బంగారు రాజు,- ఎస్ శ్రీనివాసరావు- ,జెవి రావు -రామచంద్రపురం ,ఎస్ రాజేష్ కుమార్, జి శ్రీనివాస్, ఆవిడి జి రమేష్ , మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన అనంతరం బిఆర్‌ఎస్ ఎపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News