Friday, May 3, 2024

సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిబిఐ అరెస్టు నుంచి రక్షించాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. సిబిఐ అరెస్టు, విచారణ నుంచి వారం రోజుల పాటు మినహాయింపునివ్వాలని అవినాశ్ రెడ్డి పెట్టుకున్న అభ్యర్థనను న్యాయమూర్తులు జె.కె. మహేశ్వరి, పి.ఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.

ముందస్తు బెయిల్‌పై ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత వరకు అదే రోజు విచారణ ముగించేయాలని సూచించింది. అన్ని పక్షాలు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది.

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన మిస్లేనియస్ దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ తాజా నోటీసులు జారీచేసినందున అవినాశ్ రెడ్డి న్యాయవాదులు సోమవారం న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు వినతులు సమర్పించారు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నందున సిబిఐ విచారణకు హాజరు కాలేనని, అందువల్ల తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అవినాశ్ రెడ్డి తన దరఖాస్తులో విన్నవించుకున్నారు. కాగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News