Thursday, May 2, 2024

బృహదమ్మ నుంచి వచ్చిన బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

ఆశ్వీజ మాసం వచ్చిందంటే తెలంగాణలో ఒక పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. ఎక్కడ వున్నా తమతమ సొంత ఊర్లకు వెళ్తారు ప్రత్యేకించి బతుకమ్మ, దసరా పండుగల కోసం. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు ఇమిడి ఉంటాయి. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎట్లా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు..బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు.

తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు.వేములవాడ (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండే వారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందర చోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు.

తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీ నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను, తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు.

దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మపండుగవచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది.

Qatar Bathukamma celebrations

తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఒక్కో రకమైన నైవేద్యం పెడుతారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నాల్గవ రోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవరోజు అర్రమి అలిగిన బతుకమ్మ ఈ రోజు బతుకమ్మను పేర్చరు కూడా. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమినాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేసే ముందు తర్వాత కూడా పోయిరా బతుకమ్మ పోయిరామ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావు బతుకమ్మ అని పాటలు పాడుకుంటూ స్త్రీలు కోలాహలంగా కనిపిస్తారు. చివరగా వాయినాలు ఇచ్చుపుచ్చుకులతో ఈ వేడుకలు ముగుస్తాయి.

దండంరాజు రాంచందర్ రావు
9849592958

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News