Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్‌తో బిజెపికి పొత్తు ఉండదు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః బిఆర్‌ఎస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలు, 5మంది ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని ఇదంతా మాజీ సిఎం కెసిఆర్ ఆడుతున్న నాటకమని విమర్శించారు. ప్రధాని మోడీ వారి అవినీతిపై మాట్లాడారని అధికారంలో ఉన్నప్పుడే కెసిఆర్ ఎన్డీఏలో చేరుతామని అడిగితే కూడా చేర్చుకోలేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి 17సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదని, ఆపార్టీకి ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.

ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కెసిఆర్ బ్రతిమలాడుతున్నారని, బిఆర్‌ఎస్ అవినీతిని వ్యతిరేకించి ఎవరు హరీష్ రావుతో సహా బిజెపిలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామని తెలిపారు.బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు అవగాహన ఒప్పందం ఉందని, అందుకే కుంభ కోణాలు బయటపడుతున్న కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఉంటే కెటిఆర్, కెసిఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లన్నారు. గ్రామస్ధాయిలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. కెఎ పాల్ కూడా 17 సీట్లు గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒక్కవైఫు , రజాకార్లు, ఎంఐఎం, బిఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు.

దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బిజెపికి గెలిపిస్తారని , ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీని ప్రజలే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.ఏ ప్రభుత్వం అయిన ఐదు ఏళ్లు ఉండాలని కోరుకుంటామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌ను ఇంటికి సాగనంపుతారని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బిజెపి, బిఆర్‌ఎస్ ఒక గూటి పక్షులేనని అప్పుడు కూడా కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారని, ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News