Tuesday, April 30, 2024

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఝబువా (ఎంపి):రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి 400 మించి స్థానాలు వస్తాయని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో గిరిజన ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. లోక్‌సభ మొత్తం 543 స్థానాల్లో 370 స్థానాలను బీజేపీ సాధించాలంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో గత ఎన్నికల కన్నా అదనంగా 370ఓట్లు పడేలా చూడాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. బీజేపీ కమలం గుర్తు స్వంతంగా 370 మార్కును అధిగమిస్తుందని తాను కచ్చితంగా చెప్పగలనన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పుడు తానిక్కడకు రాలేదని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యదికంగా మద్దతు ఇచ్చి తమ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెల్పడానికి ప్రజాసేవకునిగా తాను వచ్చానని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందని ప్రశంసిస్తూ, అంతకు ముందు రూ. 7550 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడాన్ని ఉదహరించారు. విపక్షం కాంగ్రెస్‌ను లక్షంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ సుదీర్ఘకాలం పేదలను, రైతులను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ఎన్నికల సమయం లోనే ఆ పార్టీకి పేదలు, రైతులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు చిట్టచివరి ఎత్తుగడలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దోచుకోవడం, విభజించడమే కాంగ్రెస్ నినాదమని ధ్వజమెత్తారు. గిరిజన ప్రజల ఆరోగ్యం కోసమే తాము సికిల్‌సెల్ అనీమియాకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు ప్రారంభించాం తప్ప గిరిజన ఓట్ల కోసం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమాన్ని ముఖ్యంగా గిరిజన ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News