Sunday, April 28, 2024

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిఆర్‌ఎస్ యత్నం : బండి సుధాకర్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ సర్కారు ఉండదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలు చేస్తున్న కెసిఆర్ పై సమగ్ర విచారణ జరపాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో చాలామంది కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారన్న సంగతి తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోతారనే భయంతోనే నిస్సహాయ పరిస్థితుల్లో కెసిఆర్ పైపైకి బీరాలు పలుకుతున్నారని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు మాత్రమే ఫైనల్ అనే విషయాన్ని మాజి సిఎం కెసిఆర్ మరిచిపోతే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా పూర్తి మెజారిటీతో ఏర్పాటై, ప్రజా రంజకంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ ఎలా పడగొడతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కు ఉన్న సంఖ్యాబలం, ప్రజాబలం చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. అయితే, కెసిఆర్ ఇంకా తానే సిఎం అనే భ్రమల్లో ఉన్నాడని, తమ కుటుంబం అక్రమంగా సంపాదించిన డబ్బుతో కెసిఆర్ ఓ సినిమా తీసి, అందులోనైతే తానే సిఎం పాత్రలో నటించవచ్చు కదా.. అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కెసిఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి కూడా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News