Friday, May 3, 2024

బిఆర్‌ఎస్ గెలుపు దేశానికి మలుపు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గెలుపు దేశానికి మలుపు. తెలంగాణలో కెసిఆర్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యం అనే నేపథ్యంలో గెలుపు ప్రభావం కేవలం తెలంగాణకే కాకుండా, జాతీయ స్థాయిలో ప్రభావితం చూపుతుంది. తెలంగాణలో బిఆర్ ఎస్ పక్కా ఘన విజయం సాధించడం ఖాయం. దీంతో కెసిఆర్ దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ నాయకుడిగా ఆవిర్భవిస్తారు. కెసిఆర్‌కు ప్రాంతీయ పార్టీలతో మంచి స్నేహ సంబంధాలు వున్నాయి. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీ య పార్టీలు పోటీ చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ప్రాంతీయ పార్టీల్లో ఏ ఒక్కటీ పోటీ చేయడం లేదు. పోటీ చేయవు కూడా. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లో అనేక సీట్లలో ఎస్‌పి అభ్యర్థులు బరిలో నిలిచారు.

చత్తీస్ గఢ్, రాజస్థాన్‌లలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్ధులు కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ 2013లో కాంగ్రెస్‌ను ఓడించారు. బిజెపి నుంచి ఉక్కపోతతో సతమతమవుతున్న కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో కలవాలా, వద్దా అనే మీమాంసలో వున్నారు. కలిస్తే ఇటు బిజెపి నుండి ఇబ్బందులు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపి పార్టీ ల ఉనికే ప్రశ్నార్ధకం మారింది. అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఈ పార్టీలను మరాఠా ప్రజలు నమ్మడం లేదు. బిజెపి, శివసేన (షిండేవర్గం) పరాకాష్ఠ రాజకీయాలకు అక్కడి ప్రజలు విసుగెత్తిపోయారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ మహారాష్ట్రలో అడుగు పెట్టింది. అక్కడ బిఆర్‌ఎస్ ప్రభంజనంలా వ్యాపిస్తున్నది. మరాఠా ప్రజలు నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నది. అక్కడ పంచాయితీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ బల పరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి రాగానే మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు.

అయిదు రాష్ట్రాల్లో కొన్నింటిని కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం ప్రాంతీయ పార్టీలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కనుక కాంగ్రెస్ ఎదిగితే తమకు ఇబ్బంది వుంటుంది. ఎప్పటికీ కొరకరాని కొయ్యగా కాంగ్రెస్ వుంటుంది. అందుకే కాంగ్రెస్‌ను ఎక్కడ వుంచాలనో అక్కడే వుంచాలి. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి బలహీనపడుతున్నది. ఒక్క కర్నాటకలో బిజెపిపై కోపంతో కాంగ్రెస్‌ను గెలిపించింది కాంగ్రెస్‌పై ప్రేమతో కాదు. గత 77 స్వాతంత్య్ర దేశంలో 50 60 ఏండ్లు కాంగ్రెస్ పాలిస్తే ఒకటి రెండు సందర్భాలు తప్ప ప్రతిసారి ప్రాంతీయ పార్టీలను అణగ దొక్కింది. అవసరం వున్నంత వరకు వాడుకుని విసిరిపారేసింది. ఇప్పుడు బిజెపి కూడా మోడీ పరిపాలనలో అదే జరుగుతున్నది. ప్రాంతీయ పార్టీలను మింగెయ్యడం కాంగ్రెస్, బిజెపిలు అలవాటు అయింది.

అందుకే దమ్మున్న నాయకుడు కెసిఆర్ జాతీయ స్థాయిలో వుండాలనేది ప్రాంతీయ పార్టీల కోరిక, బలం.కెసిఆర్ ఇప్పుడు జాతీయ నేత కాదు, ఎప్పుడో జాతీయ నాయకుడు గా తెలంగాణ కోసం దేశ వ్యాప్తంగా పార్టీలను కూడగట్టారు. అప్పటి నుంచి అనేక ప్రాంతీయ పార్టీల నాయకులతో కెసిఆర్‌కు దోస్తానా వుంది. తెలంగాణకు అనేక పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేశ్ తదితర నాయకుల కంటే ముందు చూపుతో వ్యవహరించే జాతీయ స్థాయిలో బలమైన నాయకుడు కెసిఆర్ చెప్పక తప్పదు. కెసిఆర్ వున్నారనే ధైర్యం వారికి వుంది. కాంగ్రెస్ ఎంత ఎదిగితే ప్రాంతీయ పార్టీల అంతనష్టం. కాంగ్రెస్ వల్ల పార్టీలకే కాదు ప్రజలు జీవితాల్లో చిమ్మచీకట్లే. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఆయా ప్రాంతీయ పార్టీల పొత్తులు విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభావిత స్థాయిలో ఎదిగితే ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూసే అవకాశం లేక పోలేదు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయం స్థాయిలో నేనే కింగ్ అంటుంది. అప్పుడు ప్రాం తీయ పార్టీలకు ఇబ్బంది. అందుకే తెలంగాణలో ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో అడుగు పెట్టలేదు, పెట్టవు కూడా. కెసిఆర్ లాంటి బలమైన నాయకుడు ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బలం. ఎస్‌పి నేత అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్ కుమార్, శివసేన (ఉద్ధవ్ థాక్రే) వంటి పార్టీలు కెసిఆర్ ఎదగాలనే సహజంగానే కోరుకుంటాయి. ఎందుకంటే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రాంతీయ పార్టీలను ఉనికి లేకుండా తమ దారిలో తెచ్చుకునేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది.

ప్రధాని మోడీని ఢీకొనే శక్తి ప్రస్తుతం దేశంలో సిఎం కెసిఆర్ ఒక్కరికే వుంది. రాష్ట్రంలో ఆయన హయాంలో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తున్నది. ఈ ప్రగతి సంక్షేమం ఇలానే కొనసాగాలంటే మళ్ళీ కెసిఆరే రావాలనే ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. రిస్క్ తీసుకునే ఛాన్స్ లేదు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా కానున్నారు.దీంతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కెసిఆర్‌ను కట్టడి చేస్తే దేశ రాజకీయాల్లో ఉంటాం. లేదంటే కెసిఆర్ వ్యూహం ముందు తేలిపోతాం అనేది ప్రధాని మోడీ గ్రహించారు. ఎన్ని చేయాలో అన్ని రకాల దాడులను కెసిఆర్‌ను కట్టడి చేయడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అదే రీతిలో వుంది.

కెసిఆర్ వస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ తన వైపు తిప్పుకుంటారనే విషయం గ్రహించి అమలు కాని, సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌పై బట్ట కాల్చి మీద వెయ్యాలని ఎన్నో కుట్రదారులు వెతుకుతున్నది. కాంగ్రెస్ అంటే కల్లోలం. ఆక్సిజన్ ఇచ్చిన వారినే ఊపిరి తీసే తత్వం కాంగ్రెస్‌ది. దశాబ్దాలుగా రాష్ట్రం, దేశం కాంగ్రెస్ వల్లనే వెనక్కిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ అంటే తెలంగాణ అంధకారమే. రాహుల్, రేవంత్ రెడ్డిలు చెప్పే మాటలు ఇక్కడ ఎవ్వరూ విశ్వసించరు.

అందుకే కెసిఆర్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ దూరం చేసుకోలేరు. తెలంగాణకు పెద్ద దిక్కుగా కెసిఆర్ తప్ప ఎవరురారు. అరవై ఏండ్లు కాంగ్రెస్ వల్ల ఎన్నో తరాల బిడ్డలకు నష్టం జరిగింది. రాష్ట్రం కోసం పేగులు ఎండ బెట్టుకుని పోరాటంచేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు కెసిఆర్. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిం డు. పదేండ్లలో వంద ఏండ్ల అభివృద్ధి సాధించినట్టు తెలంగాణ ముందుకుపోతున్నది. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రజలు తమ బిడ్డ వైపు వుంటారు. కెసిఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే అనే ముచ్చటరాదు. గెలుపు మాట తప్ప తెలంగాణ ప్రజలు ఇంకో ముచ్చట పెట్టరు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఉన్నతమైన, విశ్వసనీయత గల కెసిఆర్ లాంటి నాయకుడు తప్పనిసరి. తెలంగాణను గెలిచేది కెసిఆర్. ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా నాయకత్వం వహించేది కెసిఆరే.

కాంగ్రెస్‌తో వుంటే నష్టం. కెసిఆర్‌తో వుంటే ప్రాంతీయ పార్టీల ఉనికి వుంటుంది. అందుకే తెలంగాణలో కెసిఆర్ గెలుపు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు వుంటది, వుండాల్సిందే. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఏదో ఒక రూపంలో భారత రాజకీయాల్లో కెసిఆర్ ఒక సంచలనం. ఆ సంచలనం చుట్టే దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. నేడు దేశంలో కెసిఆర్ పేరు ఎత్తందే రాజకీయాలు లేవు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడిగా, ప్రగతి పథంలో దేశానికి తెలంగాణ మోడల్ నిలిపిన కెసిఆర్ చుట్టూ తిరుగుతున్నదనేది కఠోర వాస్తవం. జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా దేశంలో కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్‌గా ఆవిర్భవించింది తెలిసిందే. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సిఎం కెసిఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం.

కెసిఆర్ గులాబీ జెండా ఎగుర వేస్తే తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది. కెసిఆర్ అనే రాజకీయ సంచలనాన్ని తట్టుకోలేము అంటూ ఒకరినొకరు పోటీ అన్నట్లు కెసిఆర్‌ను గద్దె దించాలని తెగ ప్రయత్నం చేస్తున్నరు. ఎలాగైనా ఎన్నికల్లో కెసిఆర్ మళ్ళీ గెలవకుండా మొత్తం తెలంగాణ మీదనే కాంగ్రెస్, బిజెపి పార్టీలు దృష్టి కేంద్రీకరించా యి. కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్‌టిపి, జనసమితి ఒక వైపు, బిజెపి, జనసేనా మరోవైపు కూటములు కెసిఆర్‌ను ఎదుర్కోవడానికి కుట్రలు చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు కెసిఆర్‌కే మళ్ళీ పట్టం కట్టనున్నారు.

ప్రస్తుతం తెలంగాణ గ్రౌండ్ మొత్తం గులాబీ పవనాలు వీస్తున్నాయి. రాష్ట్రం కోసం కెసిఆర్ పుట్టారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. ఉద్యమ కాలంలోనే దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగారు కెసిఆర్. అందుకే జాతీయ పార్టీగా భారత రాష్ట సమితి (బిఆర్‌ఎస్) ఆవిర్భవించింది. తెలంగాణలో మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారు. కెసిఆర్ అనే సంచలనం ముందు ఎవరు నిలబడే ప్రయత్నం చేసినా విఫలప్రయోగమే. తెలంగాణ గెలుపు నుండి దేశం కెసిఆర్ పిలుపు అందుకుంటుంది. ఆ పిలుపే దేశ ప్రజల గెలుపు అవుతుంది.

చిటుకుల మైసారెడ్డి
9490524724

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News