Sunday, April 28, 2024

రక్షణ భూముల్లో రయ్…రయ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే

ఎలివేటెడ్ కారిడార్‌లకు లైన్ క్ల్లియర్

8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం

ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాం
తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్: ఎలివేటెడ్ కారిడార్‌లకు లైన్ క్లియర్ అయ్యింది. రక్షణ శాఖకు చెందిన భూ ములను రాష్ట్రానికి కేటాయించడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రామగుండం, నాగ్‌పూర్ హైవేలకు క్లియరెన్స్ రావడంతో ఉత్తర తెలంగాణకు రవాణా సదుపాయాలు విస్తరించనున్నాయని, దీనికి సం బంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్- టు నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంపై ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటం తమ చిత్తశుద్ధిని చాటిందని ఆయన చెప్పారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ రాష్టానికి సాధించుకోవాల్సిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి లేఖలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నామని సిఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలేవైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలు తలపెడుతామని ఆయన అన్నారు.
11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి…
హైదరాబాద్ నుంచి కరీంనగర్- టు రామగుండం కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి సిఎం రేవంత్ విజ్ఙప్తి చేశారు.
సికింద్రాబాద్‌లో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యకు…
నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్‌లో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు. కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందిక రంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ది పరుగులు తీయనుంది. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News