హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ ఘటికలు మ్రోగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో చాలా పక్షలు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసిఎఆర్ -నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసిసెస్, భోపాల్ లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఎవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కేంద్రం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బుధవారం అగమేఘాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది.
పక్షులను పూర్తి స్థాయిలో నిఘా పెంచడంతో పాటు ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్త చెందకుండా చూడా లని కోరింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యింది. కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులకు పిసిసిఎఫ్ ఆర్. శోభ సమాచారం ఇచ్చారు. జూ పార్క్ లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్లో వలస పక్షుల సంచారం వుంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలన్నారు. ఎవరికైనా బర్డ్ ఫ్లూకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు 18004255364 ఫోన్ చేయాలని ఆమె కోరారు.
Central government Alert All States over Bird flu