Thursday, May 2, 2024

ఉద్యాన ‘పంట’ పండాలి

- Advertisement -
- Advertisement -

CM KCR Review on Horticultural Crops

 

మూడు నెలల్లో సమగ్ర విధానం
ఏడాదిలో గణనీయమైన వృద్ధి కనిపించాలి
300 ఎకరాల విస్తీర్ణంలో కొంగరకలాన్‌లో
పంటల మార్కెట్ నిర్మాణం
ఉద్యాన పంట ఉత్పత్తుల నాణ్యతకు
ప్రత్యేక విభాగాలు : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి సమగ్ర ఉద్యానవన పంటల విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పూలు తదితర తోటల సాగులో పూర్తి స్థాయిలో మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దీని కోసం సంబంధిత అధికారులు వెంటనే ఇతర రాష్ట్రాల్లో ్ల పర్యటించి రాష్ట్రానికి అనుగుణమైన విధానాన్ని మూడు నెలల్లో రూపొందించాలన్నారు. ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సిఎం దిశా నిర్ధేశం చేశారు. ఢిల్లీ ఆజాద్ పూర్ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్ ను నెలకొల్పుతామని సిఎం వెల్లడించారు.

ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సిఎం కెసిఆర్ సమీక్ష చేశారు. మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, ఉద్యానవన శాఖ ఎండి వెంకట్రాంరెడ్డి, జెడి సరోజన, డిడి సునంద, సీనియర్ అధికారులు సత్తార్, బాబు, భాగ్యలక్ష్మి, మధుసూదన్, లహరి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యానవన శాఖను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా మండలానికి ఒక ఉద్యానవన శాఖ అధికారిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

ఉద్యానవన సాగు విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి, మార్కెటింగ్ పై నిరంతరం సమాచారం తెలుసుకోవడానికి, పంటల్లో నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యానవన శాఖకు ఇంకా ఎంత మంది ఉద్యోగులు కావాలి? శాఖను ఎలా విస్తరించాలి? అనే అంశాలపై వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న అన్ని రైతు వేదికల్లో ఉద్యానవన శాఖ అధికారులు కూడా కూర్చుని రైతులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడంతో పాటు అవసరమైన మార్కెటింగ్ విషయంలో కూడా దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరమో గుర్తించి, వాటిని రైతులతో సాగు చేయించాలన్నారు.

ఏడాదిలోగా ఫలితాలు రావాలి

రాష్ట్రంలో ఉద్యానవన సాగుకు విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కోరారు. ఉద్యానవన శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సిఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని, ఏడాదిలోగా ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు ఉద్యానవన పంటల సాగులో కూడా అగ్రస్థానం సంపాదించాలన్నారు. భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విషయంలో కూడా సమగ్ర దృక్పథం ఏర్పర్చుకోవాలన్నాని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో విభిన్న రకాల స్వభావాలు కలిగిన నేలలున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 900-1500 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం ఉందన్నారు. వృత్తి నైపుణ్యం కలిగిన లక్షలాది రైతు కుటుంబాలున్నాయని, ఇవన్నీ తోటల సాగుకు ఎంతో సానుకూలమన్నారు. ఇంత ఉండి కూడా ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు,మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

ఉద్యానవనంలో స్వయం సమృద్ధి సాధించాలి

ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. మన అవసరాలు తీర్చడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం ఎదగాలన్నారు. ఇందుకోసం ఉద్యానవన శాఖ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రైతులను చైతన్య పరచాలని సిఎం సూచించారు. ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యానవన పంటలు సాగు చేయగలుగుతామో నిర్ణయించి వాటిపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఉద్యాన వన పంటల సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలవాలన్నారు.

పంటల సాగులో రాష్ట్రంలో అగ్రగామిగా కొనసాగాలి

పండ్లు, కూరగాయలు, పూలు, నూనె గింజలు, మసాలా దినుసులు తదితర ఉద్యాన పంటల సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ఉద్యానవన శాఖ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఉద్యానవన విద్య, విస్తరణ, పరిశోధన పెంపొందాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఉద్యానవన పంటలు అద్భుతంగా పండిస్తున్నారన్నారు. అక్కడికి వెళ్ళి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. మంచి విధానాలను మనం అనుసరించాలి. తెలంగాణకు చెందిన ఉద్యానవన శాఖ అధికారులను బెంగులూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాలన్నారు. అక్కడి నుంచి నిపుణులను రాష్ట్రానికి ఆహ్వానించి, ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు.

విస్తృతంగా పరిశోధనలు జరపాలి

హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు అధ్యయనం జరగాలన్నారు. ఈ శిక్షణ అధ్యయనం ప్రక్రియ నిరంతరాయంగా సాగాలన్నారు. ఉద్యానవన తోటల సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News