Thursday, May 2, 2024

ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం

- Advertisement -
- Advertisement -

CM KCR team in Delhi over paddy Procurement

 

ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందుకే పలవురు మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ క్రమంలో కేంద్రంతో తేల్చుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు.

ఈ పర్యటనలో ధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో సిఎం కెసిఆర్ చర్చించనున్నారు. అలాగే తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర జలవనరులశాఖ, వ్యవసాయ శాఖ మంత్రిలతో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా సిఎం కెసిఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు సిఎం కెసిఆర్ ఢిల్లీలోనే మకాం వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి సిఎం కెసిఆర్ స్పష్టత కోరనున్నారు. ఇటీవల వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో కెసిఆర్ కూడా పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆయన మండిపడ్డారు. వరి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లతో పాటు కృష్ణా ట్రిబ్యునల్‌కు సంబంధించిన అంశంపై కూడా సిఎం కెసిఆర్ చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News