Tuesday, April 30, 2024

తెలంగాణలో మకాం వేసింది.. మా ఇద్దరు మంత్రులే

- Advertisement -
- Advertisement -

బిజెపి ఆరోపణపై సిఎం సిద్దరామయ్య వివరణ

బెంగళూరు: కర్నాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రులందరూ తెలంగాణలో మకాం వేయడంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ప్రతిపక్ష బిజెపి చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దరిమిలా కొందరు మంత్రులు ఆ రాష్ట్రానికి వెళ్లారని వివరించారు.

మంత్రులందరూ కాదు..కేవలం కొద్ది మంది మాత్రమే వెళ్లారని ఆయన తెలిపారు. తమకు రాజకీయాలు కూడా అవసరమని, తెలంగాణ కాంగ్రెస్ పిలుపు మేరకే తమ మంత్రులు కొందరు అక్కడకు వెళ్లారని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మునియప్ప, ఇంధన శాఖ మంత్రి కెజె జార్జి కర్నాటకకు తిరిగి వచ్చేశారని, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, గృహనిర్మాణ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ మాత్రమే తెలంగాణలో ఉన్నారని ఆయన వివరణ ఇచ్చారు.

కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో అభివృద్ధి పనులు చేపట్టడం లేదంటూ బిజెపి చేసిన విమర్శలను సిద్దరామయ్య తిప్పికొట్టారు. రాష్ట్రంలో నాలుగేళ్లు అధికారంలో ఉన్నపుడు బిజెపి చేసిన అభివృద్ధి ఏమటని ఆయన ఎదురు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు మాసాలు మాత్రమే అయిందని, అంతకుముందు నాలుగేళ్లు అధికారంలో ఉన్న బిజెపి బ్రాండ్ బెంగళూరు కోసం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బెంగళూరు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం బ్రాండ్ బెంగళూరు పేరుతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

బెంగళూరు నగరంలో కనీసం గుంతలను కూడా బిజెపి ప్రభుత్వం పూడ్చలేదని, హైకోర్టు నుంచి నిత్యం చివాట్లు, అభిశంసనలు ఎదుర్కొన్న విషయాన్ని బిజెపి మరచిపోకూడదని ఆయన హితవు చెప్పారు. బెంగళూరు గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News