Sunday, April 28, 2024

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి

గిరిజనులకు మినహాయింపు

సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి

డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్‌లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. విపక్షాల ఆందోళన నడుమ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు.ఈ క్రమంలోనే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు బిజెపి సభ్యులు ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’, ‘జై శ్రీరాం’నినాదాలు చేస్తూ బిల్లును స్వాగతించారు. అయితే ప్రత్యేక సమావేశాల రెండో రోజు సభా కార్యక్రమాల ప్రకారం ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటుగా చర్చించడం, ఆమోదించడం.. అంతా ఈ రోజే జరిగిపోవాలి. అయితే దీనికి ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ రితు ఖండూరి బిల్లుపై చర్చకు మరింత సమయాన్ని కేటాయించారు. చర్చ లేకుండానే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం అనుకున్నట్లుగా ఉందని, ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని ప్రతిపక్ష నాయకుడు యశ్‌పాల్ ఆర్య ఆరోపించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడం కోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు.

ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. గోవాలో పోర్చుగీసు పాలన నాటినుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో యుసిసిపి ప్రముఖంగా పేర్కొంది. అధికారంలోకి రాగానే సిఎం పుష్కర్ సింగ్ ధామి దీనిపై కమిటీని వేశారు. ఆ కమిటీ దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది.70కి పైగా సమావేశాలు నిర్వహించి 60 వేల మందితో మాట్లాడింది.ఆన్‌లైన్‌లో వచ్చిన 2.33 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల ముఖ్యమంత్రికి సమర్పించింది. ఇది అమలులోకి వస్తే రాష్ట్రమంతటా కులమతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. మొత్తం రాష్ట్రానికే కాకుండా బయటి రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ట్ర వాసులకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. ఉత్తరాఖండ్ తరహాలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని అనుకొంటున్న గుజరాత్, అసోం లాంటి బిజెపి పాలిత రాష్ట్రాలకు కూడా ఈ బిల్లు మార్గదర్శకం అవుతుంది. కాగా ఉమ్మడి పౌరస్మృతినుంచి రాష్ట్రంలోని గిరిజనులను బిల్లు మినహాయించింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ భాగం కింద రక్షణ కల్పించిన వర్గాల హక్కులను కూడా కాపాడడం జరుగుతుందని బిల్లులో పేర్కొన్నారు.
లివిన్ రిలేషన్‌షిప్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కాగా, లివిన్ రిలేషన్ షిప్(సహజీవనం) పట్ల ఈ బిల్లు ప్రత్యేక దృష్టి సారించింది. భారతీయ సంస్కృతి దెబ్బతింటోందన్న ఉద్దేశంతో, యువతలో మార్పు తీసుకు రావడం కోసం సహజీవనంపై కొన్ని కీలక నిబంధనలను తీసుకువచ్చింది.ఈ బిల్లు ప్రకారం.. ఎవరైతే లివిన్ రిలేషన్‌లో ఉన్నారో, ఎవరైతే సహజీవనం చేయయాలని అనుకొంటున్నారో అలాంటి వారు తమ రిలేషన్‌ను జిల్లా అధికారి వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఒక వేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్లకంటే తక్కువ ఉంటే వారి తల్లిదండ్రుల సమ్మతి కచ్చితంగా అవసరమవుతుంది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ బిల్లు హెచ్చరించింది. సహజీవనం చేసే భాగస్వాములు తమ సంబంధాన్ని నెలరోజుల్లోగా రిజిస్ట్రార్‌కు సమర్పించకపోతే నెల రోజులదాకా జైలు శిక్ష, రూ.10 వేలదాకా జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ అనుభవించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన పక్షంలో ఇంకా ఎక్కువ పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే లివిన్ రిలేషన్ షిప్‌లో మహిళను గనుక జీవిత భాగస్వామి వదిలేసినట్లయితే ఆమె భరణం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేకాకుండా తమ సహజీవనాన్ని రద్దు చేసుకునేందుకు కూడా బిల్లులో వీలు కల్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News