Sunday, April 28, 2024

తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి

- Advertisement -
- Advertisement -

బిజెపి మేనిఫెస్టోలో హామీ

ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ధరణి స్థానంలో ‘మీ భూమి’ వ్యవస్థ ఏర్పాటు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సమర్థవంత పాలన అందిస్తామని అభయం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బిజెపి తన ఎన్నికల మేని ఫెస్టోలో హామీ ఇచ్చింది.‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను శనివారం కత్రియా హోటల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు సక్రమంగా అమలవుతాయని, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ సరి గ్గా వ్యవహరించలేదని విమర్శించారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు ప్రజల  ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేందుకు బిసిలకు చెందిన ముఖ్యమంత్రి నేతృత్వంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు అంశాల వారీగా కార్యాచరణను వివరించారు.

ప్రజలందరికీ సమర్థవంతమైన పాలన అందిస్తామని, అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదంతో సుపరిపాలన అందిస్తామని చెప్పారు. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించడం ద్వారా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామన్నారు. ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన మీభూమి వ్యవస్థను తీసుకొస్తామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చూస్తామని గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.

తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందేభారత్ రైళ్లు కేటాయించామని గుర్తు చేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చామన్నారు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, దేశాల్లో తెలంగాణ భవన్‌లు నిర్మిస్తామన్నారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, సబ్సిడీ పై విత్తనాలుతో పాటు వరిపై బోనస్, పంటలకు పంట బీమా, ఆ బీమా సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్లు వచ్చే సరికి రూ. 2 లక్షలు, ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ కమిటీ వేసి బడ్జెట్ స్కూల్స్‌కు పన్ను మినహాయింపులు ఇస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు, పిఆర్‌సిపై రివ్యూ, ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి పిఆర్‌సి జీఓ 317 పై పునః సమీక్ష ఉంటుందని తెలిపారు. ఐదేళ్లకు లక్ష కోట్ల తో బీసీ అభివృద్ధ్ది నిధి, రోహింగ్యాలు, అక్రమ వలస దారులను పంపిస్తామని, 5 ఏళ్లలో మహిళలకు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం రూ. 2500 ఇన్‌పుట్ సబ్సిడీ, వరికి రూ. 3100 మద్దతు ధర, ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ అవుల పంపిణీ, నిజామాబాద్‌ను టర్మిరిక్ నగరంలో అభివృద్ధ్ది చేస్తామని వెల్లడించారు. వెనకబడిన వర్గాల సాధికారత, అందరికి చట్టం సమానంగా వర్తింపు, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహణ, హైదరాబాద్ సంస్థ్ధాన విముక్తి పోరాటంలో నాటితరం చేసిన పోరాటాలకు, త్యాగాలకు తగిన గుర్తింపు లభించేలా స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మాణం చేస్తామని, బైరాన్‌పల్లి, పరకాల ఊచకోతను స్మరించుకుంటూ ఆగస్టు 27న రజాకార్ల దుష్కృతాల సంస్మరణ దినంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాల అమలును ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా సిఎం డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News