Thursday, May 2, 2024

ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది.ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అభ్యర్ధులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖారారు చేసినా ‘బస్సు యాత్ర’ తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14వ తేదీ తర్వాత మరికొన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకేసారి అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేలు సమావేశంలో పాల్గొననున్నట్టుగా సమావేశం. అయితే ఈ సమావేశం అనంతరం ఈ నెల 15వ తేదీన మొదటి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అనేక అంశాలను పరిగణలోకి….
అభ్యర్థులను ఖరారు చేయడంలో పిసిసి స్థాయిలో కొన్ని ఇబ్బందులున్నాయి. స్క్రీనింగ్ కమిటీ లెవల్లో మరికొన్ని చిక్కులున్నాయి. వీటిని లోతుగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోవడంలో ఏఐసిసికి సైతం కొంత తలనొప్పి ఎదురవుతున్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు దాదాపు వెయ్యి మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా ఇందులో సుమారు 40 స్థానాల్లో సీనియర్లు, గెలిచే అవకాశం ఉన్నవారు, పాపులర్ లీడర్ల పేర్లు దాదాపుగా ఖరారయినట్టుగా సమాచారం. మిగిలిన స్థానాల్లో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. వీరిని సంతృప్తిపర్చడం కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నేతలకు కత్తిమీద సాములా మారింది. ఏక కాలంలో సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ, విజయావకాశాలు, సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే నివేదిక, సీనియర్ నేతల సిఫారసులు ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈనెల14వ తేదీన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసే చాన్స్ ఉన్నట్టుగా తెలిసింది. ఇటీవల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడే వార్ రూమ్ ఎదుట ఆశావహులు ప్లకార్డులతో తమ డిమాండ్లను తెలియజేశారు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ సమయానికి ఎలా ఉంటుందోనని ఢిల్లీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల లిస్టును విడుదల చేయకుండా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహారిస్తుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

కర్ణాటకలో అసంతృప్తిని చల్లార్చడానికి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేసి ఇతర పదవులతో వారిని సంతృప్తి పర్చాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. నామినేషన్ ప్రక్రియ వచ్చే నెల 3న ప్రారంభం కానున్న నేపథ్యంలో వివాదం లేని స్థానాలు, అసంతృప్తికి ఆస్కారం లేని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. మిగిలిన స్థానాల అభ్యర్థుల జాబితాను విడతల వారీగా విడుదల చేయాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం.

నేడు గాంధీభవన్‌లో బిసి నాయకుల ఆందోళన
నేడు బిసిలకు 30 నుంచి 40 సీట్లను కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్‌లోని బిసి నాయకులు గాంధీభవన్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు బిసిలకు అధికంగా టికెట్‌లను కేటాయించాలని కోరుతూ పలువురు బిసి సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని, సోనియాను, మల్లికార్జునఖర్గేలను కలిసి పలుమార్లు విజ్ఞప్తి సైతం చేశారు. అయినా వారి విజ్ఞప్తులను అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బిసి నాయకులు నేడు గాంధీభవన్‌లో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News